
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 2020-21 సీజన్లో ముంబై సిటీ జైత్రయాత్ర కొనసాగుతోంది. అద్భుత ఆటతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుని.. పట్టికలో టాప్ పోసిషన్లో కొనసాగుతోంది. ఆదివారం హైదరాబాద్ ఎఫ్సీ జట్టుతో జరిగిన మ్యాచులో 2-0తో ముంబై విజయాన్ని అందుకుంది. ముంబై తరపున విఘ్నేష్ దక్షిమమూర్తి (38), ఆడమ్ లే ఫోండ్రేలు (59) తలో గోల్ చేశారు. వచ్చిన అవకాశాలను చేజార్చుకున్న హైదరాబాద్ ఓటమిని చవిచూసింది. 16 పాయింట్లతో ముంబై అగ్రతానంలో ఉండగా.. 9 పాయింట్లతో హైదరాబాద్ ఆరవ స్థానంలో ఉంది.
ఆదివారం జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. కేరళ బ్లాస్టర్స్, ఈస్ట్ బెంగాల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రా అయింది. ఈస్ట్ బెంగాల్ తరఫున బకరీ కోన్, కేరళ బ్లాస్టర్స్ తరఫున జేక్సన్ గోల్స్ చేశారు. మొదటి అర్ధభాగంలో ఈస్ట్ బెంగాల్ ఆధిపత్యం చెలాయించగా.. కేరళ బ్లాస్టర్స్ రెండో అర్ధభాగం చివరలో పుంజుకుంది. మ్యాచ్ ముగిసే సమయానికి జేక్సన్ పుజుకోవడంతో కేరళ డ్రాతో ముగించింది. మూడు పాయింట్లతో కేరళ 9వ స్థానంలో ఉంది. రెండును పాయింట్లతో బెంగాల్ 10వ స్థానంలో ఉంది.
సోమవారం జరిగే మ్యాచులో ఏటికే మోహన్ బగాన్, బెంగళూరు ఎఫ్సీ జట్లు తలపడనున్నాయి. ఫటోర్డా స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలవనుంది. ఈ మ్యాచులో రెండు జట్లు ఫేవరేట్లుగా బరిలోకి దిగుతున్నాయి. పట్టికలో ఏటికే, బెంగళూరు జట్లు రెండు, మూడో స్థానాల్లో కొనసాగుతున్నాయి. 13 పాయింట్లతో ఏటికే రెండో స్థానంలో ఉండగా.. 12 పాయింట్లతో బెంగళూరు మూడో స్థానంలో ఉంది.