
పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)2020-21లో భాగంగా గురువారం ఎస్సీ ఈస్ట్ బెంగాల్, జంషెడ్పూర్ ఎఫ్సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. మొదటి అర్ధ భాగంలో గోల్ కోసం ఇరు జట్లు పలుమార్లు ప్రయత్నించాయి. రెండో అర్ధభాగంలో కూడా ఆటగాళ్లు పోరాడారు కానీ గోల్ మాత్రం చేయలేకపోయారు.
ఈ డ్రాతో ఈస్ట్ బెంగాల్ ఐఎస్ఎల్ 2020-21లో తొలి పాయింట్ను తమ ఖాతాలో వేసుకుంది. ఈస్ట్ బెంగాల్ మొదటి పాయింట్ను అయితే సాధించింది కానీ ఈ ఎడిషన్లో ఆ జట్టు ఇంకా ఒక గోల్ కూడా చేయలేదు. బెంగాల్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. ఇక జంషెడ్పూర్ 6 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. నాలుగు విజయాలతో ముంబై సిటీ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఈరోజు ఏటీకే మోహన్ బగాన్, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచులో వరుస విజయాలతో ఊపుమీదున్న ఏటీకే మోహన్ బగాన్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. ఏటీకే ఆడిన నాలుగు మ్యాచులలో మూడు విజయాలు అందుకుని పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇక హైదరాబాద్ ఆడిన మూడు మ్యాచులలో ఒకటి గెలిచి, రెండు డ్రా చేసుకుంది. హైదరాబాద్ జట్టు 5 పాయింట్లతో ఏడవ స్థానంలో ఉంది.