
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 లానే ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఏడో సీజన్ కూడా అభిమానులను అలరిస్తోంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఒక్కో గోల్ మాత్రమే నమోదు అయినా.. మూడో మ్యాచ్లో మాత్రం అసలైన ఫుట్బాల్ వినోదాన్ని పంచింది. ఆదివారం గోవా ఎఫ్సీ, బెంగళూరు ఎఫ్సీ మధ్య జరిగిన మ్యాచ్ 2-2 గోల్స్తో 'డ్రా'గా ముగిసింది. గోవా ఫార్వర్డ్ ఇగోర్ ఎంజు మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి జట్టుకు ఓటమిని తప్పించాడు. ఇది ఫుట్బాల్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈరోజు రాత్రి ఒడిశా ఎఫ్సీతో హైదరాబాద్ ఎఫ్సీ తలపడనుంది.
తొలి సీజన్ (2019-20)లో అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయింది. కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచి నిరాశ పరిచింది. దీంతో ఈసారి మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని చూస్తోంది. ఈ క్రమంలోనే జట్టులో భారీ మార్పులు చేసిన హైదరాబాద్ ఎఫ్సీ.. ఈ సీజన్ తొలి మ్యాచులోనే బోణీ కొట్టాలని భావిస్తోంది. అన్ని విధాల సిద్దమైన హైదరాబాద్ గెలుపు లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం.
ఫుట్బాల్లో హైదరాబాద్కు ఘనమైన చరిత్ర ఉంది. ఎంతో మంది కోచ్లను, మరెందరో ఆటగాళ్లను భాగ్యనగరం ఫుట్బాల్ ప్రపంచానికి పరిచయం చేసింది. 1950-60 కాలం నిజామ్స్ జట్టుకు తిరుగేలేదు. అప్పుడు మన జట్టు బరిలోకి దిగిందంటే.. అభిమానులు విజయంపై ధీమాగా ఉండేవారు. కానీ ఆ దూకుడు తాజా హైదరాబాద్ ఎఫ్సీ కొనసాగించలేకపోయింది. కనీసం ఈ సీజన్లోనైనా నగర వైభవాన్ని చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.
జట్లు (అంచనా):
హైదరాబాద్:
సుబ్రతా పాల్, నిఖిల్ పూజారి, ఆదిల్ ఖాన్, ఒడి ఒనైండియా, సాహిల్ పన్వర్, లూయిస్ శాస్త్రే, మొహమ్మద్ యాసిర్, హలీచరన్ నార్జరీ, లిస్టన్ కోలాకో, జోయెల్ చియానీస్, అరిడేన్ సంతాన.
ఒడిశా:
కమల్జిత్ సింగ్, శుభం సారంగి, జాకబ్ ట్రాట్, స్టీవెన్ టేలర్, కమల్ప్రీత్ సింగ్, కోల్ అలెగ్జాండర్, వినిత్ రాయ్; జెర్రీ మావిహ్మింగ్తాంగా, మార్సెలిన్హో, నందకుమార్ సేకర్, మాన్యువల్ ఒన్వు.