గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీ ఏడో సీజన్లో ముంబై సిటీ జోరు కొనసాగుతోంది. గత మ్యాచులో ఓడిన ముంబై.. కేరళ బ్లాస్టర్స్పై విజయం సాధించింది. బాంబోలిమ్లోని జీఎంసీ స్టేడియంలో బుధవారం రాత్రి కేరళ బ్లాస్టర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై 2-1 తేడాతో గెలిచింది. తొలి అర్ధభాగంలో కేరళ ఆధిక్యంలో నిలిచినా.. రెండో అర్ధభాగంలో ముంబై రెచ్చిపోయింది. రెండు గోల్స్ బాది అద్భుత విజయాన్ని అందుకుంది.
27వ నిమిషంలో వైసెంట్ గోమెజ్ గోల్ బాదడంతో కేరళ బ్లాస్టర్స్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ముంబై సిటీ పదేపదే తప్పిదాలు చేసి తొలి అర్ధభాగంలో వెంబడిపోయింది. రెండో అర్ధభాగం మొదలైన నిమిషానికే ముంబై గోల్ బాది స్కోరును 1-1తో సమం చేసింది. 46వ బిపిన్ సింగ్ నిమిఇషంలో గోల్ బాదాడు. ఇక 67వ నిమిషంలో లే ఫండర్ గోల్ చేయడంతో ముంబై ఆధిక్యంలోకి వెళ్లింది. ఆపై కేరళ విఫలమవడంతో ముంబై విజయం సాధించింది. కేరళకు ఇది వరుసగా రెండో ఓటమి.
గురువారం జరిగే మ్యాచులో గోవా ఎఫ్సీతో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీ తలపడనుంది. గోవాలోని తిలక్ మైదాన్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో నార్త్ ఈస్ట్ ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగనుంది. నార్త్ ఈస్ట్ వరుసగా మూడు మ్యాచులలో విజయాలు సాధించింది. గోవా 21 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా.. నార్త్ ఈస్ట్ అదే 21 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉంది.
పాయింట్ల పట్టికలో ముంబై సిటీ, ఏటికే మోహన్ బగాన్, హైదరాబాద్ ఎఫ్సీ టాప్-3లో ఉన్నాయి. 15 మ్యాచులలో 10 విజయాలు అందుకుని 33 పాయింట్లతో ముంబై అగ్రస్థానంలో ఉంది. 14 మ్యాచులు ఆడిన ఏటికే 8 విజయాలతో 27 పాయింట్లు ఖాతాలో వేసుకుని రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్ జట్టు ఐదు విజయలతో 22 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. గోవా ఎఫ్సీ, నార్త్ ఈస్ట్ యునైటెడ్ టాప్-5లో ఉన్నాయి.
మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ట్వీట్పై స్పందించిన ప్రధాని మోదీ!!