గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీ ఏడో సీజన్లో ముంబై సిటీ ఎఫ్సీ జోరు కొనసాగిస్తోంది. గోవాలోని తిలక్ మైదాన్ స్టేడియంలో శుక్రవారం రాత్రి ఈస్ట్ బెంగాల్ ఎఫ్సీ జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై సిటీ 1-0తో గెలుపొందింది. మౌర్తాడ ఫాల్ గోల్ బాది ముంబైకి విజయాన్ని అందించాడు. ముంబై తరఫున ఫాల్ 28వ నిమిషంలో ఏకైక గోల్ బాదాడు. చివరి ఐదు మ్యాచులలో ముంబైకి ఓటమే లేదు. ఏకంగా నాలుగు గెలిచి.. ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది.
తొలి అర్ధ భాగంలో ముంబై సిటీ ఆధిపత్యం చెలాయించింది. అయితే ఈస్ట్ బెంగాల్ కూడా గట్టిపోటీ ఇచ్చింది. ముంబై కొట్టిన కొన్ని గోల్స్ను బెంగాల్ అడ్డుకుంది. అయితే 28వ నిమిషంలో మౌర్తాడ ఫాల్ గోల్ బాదడంతో ముంబై ఖాతా తెరిచింది. దీంతో తొలి అర్ధ భాగంలో ఒక గోల్ నమోదు అయింది. రెండో అర్ధ భాగంలో కూడా ఇరు జట్లు గోల్ కోసం ప్రయత్నాలు చేసినా.. అవి ఫలించలేదు. దీంతో ముంబై విజయాన్ని అందుకుంది. 13 మ్యాచులు ఆడిన బెంగాల్ 2 విజయాలతో పట్టికలో 10వ స్థానంలో ఉంది.
శనివారం జరిగే పోరులో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీతో గోవా ఎఫ్సీ తలపడుతుంది. ఈ మ్యాచులో గోవా ఎఫ్సీ ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగనుంది. ముంబై సిటీ, ఏటికే మోహన్ బగాన్, గోవా ఎఫ్సీ టాప్-3లో ఉన్నాయి. 12 మ్యాచులలో 9 విజయాలు అందుకుని 29 పాయింట్లతో ముంబై అగ్రస్థానంలో ఉంది. 12 మ్యాచులు ఆడిన ఏటికే 7 విజయాలతో 24 పాయింట్లు ఖాతాలో వేసుకుని రెండో స్థానంలో ఉంది. గోవా ఐదు విజయలతో 19 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్, నార్త్ ఈస్ట్ యునైటెడ్ టాప్-5లో ఉన్నాయి.
టీమిండియా ఆటగాళ్లకు మరో కొత్త టెస్ట్.. 8 నిమిషాల్లోనే 2 కిమీ!! ఎన్నిసార్లంటే?