
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీ ఏడో సీజన్లో జంషెడ్పూర్ ఎఫ్సీ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. గోవాలోని బాంబోలిమ్లోని జిఎంసి అథ్లెటిక్ స్టేడియంలో సోమవారం రాత్రి ఒడిశా ఎఫ్సీతో జరిగిన మ్యాచ్లో జంషెడ్పూర్ 1-0 తేడాతో గెలిచింది. ఆరంభం నుంచే జంషెడ్పూర్ ఆధిపత్యం చలాయించింది. 41వ నిమిషంలో మహ్మద్ మొబాషీర్ గోల్తో జంషెడ్పూర్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత కూడా జోరు కొనసాగింది. ఇక రెండో అర్ధ భాగంలో ఒడిశా ఒక్క గోల్ కూడా నమోదుచేయకపోవడంతో జంషెడ్పూర్ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఐఎస్ఎల్ ఏడో సీజన్లో మహ్మద్ మొబాషీర్కు ఇదే మొదటి గోల్. అంతేకాదు ఐఎస్ఎల్లోనే తొలి గోల్ కూడా. మొబాషీర్ గోల్ చేయడంతో జంషెడ్పూర్ ఎఫ్సీ ఆరవ స్థానంకు దూసుకెళ్లింది. జంషెడ్పూర్ ఇప్పటివరకు ఆడిన 15 మ్యాచుల్లో 4 విజయాలతో 18 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. జంషెడ్పూర్ గత ఐదు మ్యాచులలో ఒక విజయం, రెండు డ్రాలు, రెండు ఓటములను ఎదుర్కొంది. మరోవైపు ఒడిశా ఎఫ్సీ విజయం కోసం తంటాలు పడుతోంది. ఈ సీజన్లో ఇప్పటివరకు కేవలం ఒక విజయాన్ని మాత్రమే అందుకుంది. ఆడిన 14 మ్యాచులలో ఏకంగా 8 ఓటములను చవిచూసింది. 8 పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో ఉంది.
మంగళవారం జరిగే మ్యాచులో ఈస్ట్ బెంగాల్ ఎఫ్సీతో బెంగళూరు ఎఫ్సీ తలపడనుంది. గోవాలోని తిలక్ మైదాన్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో సునీల్ ఛెత్రి నేతృత్వం వహిస్తున్న బెంగళూరు ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగనుంది. భారత స్టార్ ఆటగాడు అయిన ఛెత్రి ఇప్పటివరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఒక్కటి కూడా చేయలేదు. ఈ మ్యాచులో అయినా మెరుస్తాడేమో చూడాలి.
పాయింట్ల పట్టికలో ముంబై సిటీ, ఏటికే మోహన్ బగాన్, హైదరాబాద్ ఎఫ్సీ టాప్-3లో ఉన్నాయి. 14 మ్యాచులలో 9 విజయాలు అందుకుని 30 పాయింట్లతో ముంబై అగ్రస్థానంలో ఉంది. 14 మ్యాచులు ఆడిన ఏటికే 8 విజయాలతో 27 పాయింట్లు ఖాతాలో వేసుకుని రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్ జట్టు ఐదు విజయలతో 22 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. గోవా ఎఫ్సీ, నార్త్ ఈస్ట్ యునైటెడ్ టాప్-5లో ఉన్నాయి.