మార్గావ్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీ ఏడో సీజన్లో ఎస్సీ ఈస్ట్ బెంగాల్ ఆలస్యంగా పుంజుకుంది. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఈస్ట్ బెంగాల్ జట్టు 1-0 తేడాతో వరుస ఓటములతో ఒత్తిడిలో ఉన్న బెంగళూరు ఎఫ్సీపై గెలిచింది. దీంతో ఈ సీజన్లో ఈస్ట్ బెంగాల్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మట్టి స్టెయిన్మన్ (20వ నిమిషంలో) జట్టుకు గోల్ అందించాడు. తాత్కాలిక కోచ్ నౌషాద్ మూసా తన మొదటి గేమ్లో నాలుగు మార్పులు చేయడం బెంగాల్ జట్టుకు కలిసొచ్చింది.
ఈస్ట్ బెంగాల్ జట్టు ప్లేయర్ ఎరిక్ పార్తలు ఒక మ్యాచ్ సస్పెన్షన్ తరువాత తుది జట్టులోకి తిరిగి వచ్చాడు. ఉదాంత సింగ్ అద్భుత ఆరంభం ఇవ్వగా.. నౌషాద్ మూసా, పరాగ్ శ్రీవాస్, అజిత్ కుమార్ కొనసాగించారు. ఇక 20వ నిమిషంలో మట్టి స్టెయిన్మన్ అద్భుత గోల్ చేయడంతో ఈస్ట్ బెంగాల్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి అర్ధ భాగంలో బెంగాల్ ఆధిపత్యం చెలాయించింది. రెండో భాగంలో బెంగళూరు ఆటగాళ్లు పలుమార్లు గోల్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో మ్యాచులో ఏకైక గోల్ కొట్టిన బెంగాల్ విజయాన్ని అందుకుంది.
ఎస్సీ ఈస్ట్ బెంగాల్ చివరి ఐదు మ్యాచులలో ఒక్కటి కూడా ఓడిపోలేదు. అంతేకాదు రెండు విజయాలను కూడా అందుకుంది. మరోవైపు బెంగళూరు ఎఫ్సీకి ఇది వరుసగా ఐదవ ఓటమి. ఈస్ట్ బెంగాల్ 10 మ్యాచులు ఆడి రెండు విజయాలు.. నాలుగు ఓటములను ఎదుర్కొంది. ఇక నాలుగు డ్రాలతో 10 పాయింట్లు ఖాతాలో వేసుకుని పట్టికలో 9వ స్థానంలో ఉంది. మరోవైపు బెంగళూరు 10 మ్యాచులలో మూడు విజయాలు, నాలుగు ఓటములు, మూడు డ్రాలతో 6వ (12 పాయింట్లు) స్థానంలో ఉంది.
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీ ఏడో సీజన్లో భాగంగా ఈ రోజు రెండు మ్యాచులు జరగనున్నాయి. చెన్నైయిన్ ఎఫ్సీ, ఒడిశా ఎఫ్సీ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఉంది. బాంబోలిమ్లోని జిఎంసి స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక రెండో మ్యాచులో కేరళ బ్లాస్టర్స్ను జంషెడ్పూర్ ఎఫ్సీ ఢీ కొట్టనుంది. వాస్కోలోని తిలక్ మైదానంలో రాత్రి 7.30కు మ్యాచ్ మొదలవనుంది.
Sydney Test: స్మిత్ హాఫ్ సెంచరీ.. భారీ ఆధిక్యంలో ఆసీస్!!