
వాస్కోడిగామా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఏడో సీజన్లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీ వరుస విజయాలతో దూసుకెళుతోంది. గత ఐదు మ్యాచులలో మూడో విజయాన్ని అందుకుంది. ఆదివారం సాయత్రం తిలక్ మైదాన్ స్టేడియంలో ఒడిశా ఎఫ్సీతో జరిగిన మ్యాచులో లూయిస్ మచాడో రెండు గోల్స్ చేయడంతో నార్త్ ఈస్ట్ యునైటెడ్ 3-1తో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో నార్త్ ఈస్ట్ ఐదవ స్థానం నుంచి మూడుకు దూసుకెళ్లింది. మ్యాచులో నమోదైన నాలుగు గోల్స్ మొదటి అర్ధ భాగంలోనే రావడం విశేషం.
లూయిస్ మచాడో 9వ నిమిషంలోనే గోల్ బాది నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. 19వ నిమిషంలో దేశోర్న్ బ్రౌన్ మరో గోల్ కొట్టి నార్త్ ఈస్ట్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. 24వ నిమిషంలో మచాడో మరో గోల్ చేసి నార్త్ ఈస్ట్ జట్టును 3-0తో తిరులేని స్థితిలో నిలిపాడు. ఇక 45 నిమిషంలో ఒడిశా ఆటగాడు బ్రాడెన్ ఇన్మాన్ గోల్ బాది.. ప్రత్యర్థి జట్టు ఆధిక్యాన్ని 3-1కి తగ్గించాడు. రెండో భాగంలో ఇరు జట్లు గోల్ చేయలేదు. దీంతో నార్త్ ఈస్ట్ 3-1తో గెలుపొందింది. ఇక ఆదివారం రాత్రి జరిగిన మరో మ్యాచులో జంషెడ్పూర్ ఎఫ్సీపై ఏటీకే మోహన్ బగాన్ 1-0తో గెలిచింది. 85 నిమిషంలో రాయ్ కృష్ణ ఏకైక గోల్ కొట్టాడు.
సోమవారం బెంగళూరు ఎఫ్సీతో ముంబై సిటీ తలపడనుంది. గోవాలోని జిఎంసి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో ముంబై సిటీ ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగనుంది. బెంగళూరు చివరి మ్యాచ్ ఓడిపోగా.. ముంబై డ్రా చేసుకుంది. ముంబై 10 విజయాలతో పట్టికలో టాప్-2లో ఉండగా.. బెంగళూరు 4 విజయాలతో 7వ స్థానంలో ఉంది. చివరి ఐదు మ్యాచులలో ఇరు జట్లు చెరో మ్యాచ్ ఓడిపోయాయి.
పాయింట్ల పట్టికలో ఏటికే మోహన్ బగాన్, ముంబై సిటీ, నార్త్ ఈస్ట్ యునైటెడ్ టాప్-3లో ఉన్నాయి. 17 మ్యాచులలో 11 విజయాలు అందుకుని 36 పాయింట్లతో ఏటికే అగ్రస్థానంలో ఉంది. 16 మ్యాచులు ఆడిన ముంబై 10 విజయాలతో 34 పాయింట్లు ఖాతాలో వేసుకుని రెండో స్థానంలో ఉంది. నార్త్ ఈస్ట్ ఆరు విజయలతో 26 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. గోవా ఎఫ్సీ, హైదరాబాద్ ఎఫ్సీ టాప్-5లో ఉన్నాయి.