
మార్గావ్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీ ఏడో సీజన్ రోజురోజుకు ఆసక్తికరంగా సాగుతోంది. అన్ని జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుండడంతో మ్యాచులు చివరివరకు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆదివారం ఫటోర్డా స్టేడియంలో జరిగిన ఎఫ్సీ గోవా, కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీ మ్యాచ్ కూడా ఇలానే సాగింది. చివరకు ఎఫ్సీ గోవా ఘనవిజయం సాధించింది. ఇగోర్ అంగులో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఎఫ్సీ గోవా 3-1తో కేరళ బ్లాస్టర్స్పై ఘనవిజయం సాధించింది. ఇగోర్ అంగులో 30, 90 నిమిషాల్లో గోల్స్ కొట్టి గోవా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఎఫ్సీ గోవా తరఫున మరో గోల్ను జార్జ్ ఓర్టిజ్ మెండోజా 52వ నిమిషంలో సాధించాడు. కేరళ తరఫున ఏకైక గోల్ను విన్సెంట్ గోమెజ్ 90వ నిమిషంలో కొట్టాడు. జువాన్ ఫెర్రాండో ఎఫ్సీ గోవా ప్రధాన కోచ్గా తన మొదటి విజయాన్ని అందుకున్నాడు. ఫెర్రాండో రెండు మార్పులు చేసి తన జట్టుకు విజయాన్ని అందించాడు.
నేడు జరిగే మ్యాచ్లో ఏటీకే మోహన్ బగాన్ ఎఫ్సీ, జంషెడ్పూర్ ఎఫ్సీ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఏటీకే మోహన్ బగాన్ ఆడిన మూడు మ్యాచులలో విజయాలు అందుకోగా.. జంషెడ్పూర్ ఒక్క విజయాన్ని కూడా అందుకోలేదు. జంషెడ్పూర్ ఆడిన మూడు మ్యాచులలో రెండింటిని డ్రా చేసుకుని, ఒకదాంట్లో ఓటమిపాలైంది. ఈరోజు మోహన్ బగాన్ ఎఫ్సీ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది.