గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఏడో సీజన్లో అదిరే ప్రదర్శనతో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ మళ్లీ గెలుపు బాటపట్టింది. వరుసగా మూడు పరాజయాల తర్వాత హైదరాబాద్ బలంగా పుంజుకుని ఓ ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 4-1 తేడాతో రెండుసార్లు చాంపియన్ అయిన చెన్నయిన్ ఎఫ్సీని చిత్తుచిత్తుగా ఓడించింది. మ్యాచ్ ఆసాంతం హైదరాబాద్ ఆటగాళ్లు అద్భుత ఆటతో ఆకట్టుకున్నారు.
తొలి అర్ధ భాగంలో రెండు జట్లు హోరాహోరీగా తలపడడంతో గోల్స్ నమోదు కాలేదు. విరామం తర్వాత హైదరాబాద్ అనూహ్యంగా చెలరేగింది. ప్రత్యర్థి గోల్ పోస్టుపై వరుసగా దాడులు చేసింది. మొదట జోయల్ చియానెస్ (50వ నిమిషంలో) గోల్ కొట్టడంతో హైదరాబాద్ జట్టు ఖాతా తెరిచింది. ఆ తర్వాత మూడు నిమిషాలకే హాలిచరణ్ నర్జారీ (53వ నిమిషంలో) గోల్ కొట్టి జట్టు ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. కొద్దిసేపటికి అనిరుధ్ థాపా (67వ నిమిషంలో) గోల్తో చెన్నయిన్ పోటీలోకి వచ్చేలా కనిపించింది. కానీ విక్టర్ (74వ నిమిషంలో) తో పాటు హాలిచరణ్ (79వ నిమిషంలో) మరో గోల్ కొట్టడంతో హైదరాబాద్ సునాయాస విజయాన్ని అందుకుంది.
ఐఎస్ఎల్ ఏడో సీజన్లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆడిన తొమ్మిది మ్యాచులలో మూడు డ్రాలు, మూడు ఓటములను ఎదుర్కొంది. 12 పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో ఉంది. మరోవైపు చెన్నయిన్ ఎఫ్సీ ఆడిన తొమ్మిది మ్యాచులలో రెండు విజయాలు, మూడు ఓటములతో 8వ స్థానంలో కొనసాగుతోంది. ఐఎస్ఎల్ ఏడో సీజన్లో భాగంగా ఈరోజు బెంగళూరు ఎఫ్సీ, ముంబై సిటీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబై చివరి రెండు మ్యాచులలో విజయాలు అందుకోగా.. బెంగళూరు ఓటములను ఎదుర్కొంది.
ఆసీస్ బ్యాటింగ్ను రహానే అధ్యయనం చేశాడు.. ఆ ఎత్తుగడ సూపర్: ప్రవీణ్