వాస్కోడిగామా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఏడో సీజన్లో హైదరాబాద్ ఎఫ్సీ అద్భుత విజయం సాధించింది. వాస్కోడిగామాలోని తిలక్ మైదాన్ స్టేడియంలో మంగళవారం రాత్రి కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీతో జరిగిన మ్యాచులో హైదరాబాద్ 4-0తో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో ఐదవ స్థానం నుంచి మూడుకు దీసుకెళ్లింది. హైదరాబాద్ విజయంలో అరిడేన్ సంతాన, ఫ్రాన్ సందజా కీలక పాత్ర పోషించారు. రెండో అర్ధ భాగంలో ఇద్దరూ తలో రెండో గోల్స్ బాదారు.
అస్లన్ కొత్త రికార్డు.. క్వాలిఫయర్గా అడుగుపెట్టి! సెరెనా vs ఒసాకా!
మ్యాచ్ ఆరంభంలో హైదరాబాద్ ఎఫ్సీ, కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీ జట్లు గోల్ కోసం ప్రయత్నించాయి. ఇరు జట్లు వచ్చిన అవకాశాలను సద్వినియోగపర్చుకోలేకపోయాయి. దీంతో తొలి భాగం గోల్ లేకుండానే ముగిసింది. రెండో భాగంలో హైదరాబాద్ రెచ్చిపోయింది. ఏకంగా నాలుగు గోల్స్ చేసింది. ఫ్రాన్ సందజా (58, 63), అరిడేన్ సంతాన (86, 91) నిమిషాల్లో గోల్స్ బాది తమ జట్టుకు ఊహించని విజయాన్ని అందించారు. ఈ విజయంతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది.
బుధవారం గోవా ఎఫ్సీతో ఒడిశా ఎఫ్సీ తలపడనుంది. మార్గోలోని ఫటోర్డా స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో గోవా ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగనుంది. గోవా గత ఐదు మ్యాచులను డ్రా చేసుకోగా.. ఒడిశా మూడు ఓడి, రెండింటిని డ్రాగా ముగించింది. గోవా పట్టికలో టాప్-5లో ఉండగా.. ఒడిశా చివరి స్థానంలో ఉంది.
పాయింట్ల పట్టికలో ఏటికే మోహన్ బగాన్, ముంబై సిటీ, హైదరాబాద్ ఎఫ్సీ టాప్-3లో ఉన్నాయి. 17 మ్యాచులలో 11 విజయాలు అందుకుని 36 పాయింట్లతో ఏటికే అగ్రస్థానంలో ఉంది. 17 మ్యాచులు ఆడిన ముంబై 10 విజయాలతో 34 పాయింట్లు ఖాతాలో వేసుకుని రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్ ఆరు విజయలతో 27 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. నార్త్ ఈస్ట్ యునైటెడ్, గోవా ఎఫ్సీ టాప్-5లో ఉన్నాయి.