
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఏడో సీజన్లో భాగంగా ఆదివారం ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ చివరకు 'డ్రా'గా ముగిసింది. బెంగళూరు ఎఫ్సీ, గోవా ఎఫ్సీ మధ్య జరిగిన మ్యాచ్ చివరకు 2-2తో సమమైంది. ఓటమి ఖాయం అనుకున్న చోట గోవా ఎఫ్సీ ఫార్వర్డ్ ఇగోర్ ఎంజులో అద్భుతం చేశాడు. మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి జట్టుకు ఓటమిని తప్పించాడు. తొలి రెండు మ్యాచ్ల్లో ఒక్కో గోల్ మాత్రమే నమోదు కాగా.. మూడో మ్యాచ్ మాత్రం అసలైన ఫుట్బాల్ వినోదాన్ని పంచింది.
సునీల్ చెత్రి నాయకత్వంలోని బెంగళూరు తొలి అర్ధ భాగంలో అదరగొట్టింది. హర్మన్జోత్ సింగ్ లాంగ్ త్రోను ముందుకు దూసుకుంటూ వచ్చిన క్లెటాన్ సిల్వా.. తలతో బంతిని గోల్ పోస్ట్లోకి పంపి బెంగళూరుకు 1-0 ఆధిక్యాన్నిచ్చాడు. ఇక రెండో అర్ధ భాగంలో ఎరిక్ ఎండెల్ హెడర్ ఇచ్చిన పాస్ను గోల్గా మలిచిన ఆంటోనియో గొంజాలెజ్ బెంగళూరును 2-0తో పటిష్ట స్థితిలో నిలిపాడు. ఈ దశలో బెంగళూరు గెలుపు ఖాయంలా కనిపించింది.
అయితే బెంగళూరు విజయావకాశాలను ఇగోర్ ఎంజు దెబ్బ తీశాడు. అల్బెర్టో, జెసురాజ్ ఇచ్చిన పాస్లను గోల్స్గా మలిచి.. మ్యాచ్ను మలుపుతిప్పాడు. 66, 69వ నిమిషాల్లో ఎంజు గోల్స్ చేశాడు. ఆ తర్వాత గెలుపు గోల్ కోసం రెండు జట్లూ చివరి దాకా పోరాడి విఫలమయ్యాయి. దీంతో మ్యాచ్ 'డ్రా'గా ముగిసింది. ఫలితం తేలని పోరులో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.
బెంగళూరు ఆటగాళ్లు క్లెటాన్ సిల్వా (27వ నిమిషంలో), ఆంటోనియో గొంజాలెజ్ (57వ నిమిషంలో) తలా ఓ గోల్ సాధించారు. గోవా తరఫున ఇగోర్ (66వ, 69వ నిమిషాల్లో) రెండు గోల్స్ కొట్టాడు. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' ఇగోర్ ఎంజుకు దక్కింది. నేడు ఒడిశా ఎఫ్సీతో హైదరాబాద్ ఎఫ్సీ తలపడుతుంది.