గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఏడో సీజన్లో హైదరాబాద్ ఎఫ్సీకి నిరాశే మిగిలింది. సీజన్ ఆసాంతం మెరుగైన ప్రదర్శన చేసినా.. హైదరాబాద్ సెమీస్లో అడుగుపెట్టలేకపోయింది. నాకౌట్ చేరాలంటే తప్పక గెలువాల్సిన చివరి లీగ్ మ్యాచ్ను సమం చేసుకొని ఐదో స్థానంతో టోర్నీని ముగించింది. ఆదివారం సాయంత్రం ఫటోర్డా స్టేడియంలో గోవా ఎఫ్సీతో జరిగిన మ్యాచ్ను హైదరాబాద్ 0-0తో సమం చేసుకుంది.
మ్యాచ్ డ్రా అయినా హైదరాబాద్ ఎఫ్సీ కంటే రెండు పాయింట్లు ఎక్కువ ఉన్న గోవా ఎఫ్సీ సెమీస్ చేరింది. 20 మ్యాచులు ఆడిన హైదరాబాద్ ఆరు విజయాలతో 29 పాయింట్లు ఖాతాలో వేసుకుని ఐదవ స్థానంతో టోర్నీని ముగించింది. 20 మ్యాచులు ఆడిన గోవా 7 విజయాలతో 31 పాయింట్లు ఖాతాలో వేసుకుని సెమీస్ చేరింది. ఏటికే మోహన్ బగాన్, ముంబై సిటీ, నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఇప్పటికే సెమీస్ చేరిన విషయం తెలిసిందే.
ఆదివారం రాత్రి జరిగిన మరో మ్యాచులో ముంబై సిటీ విజయం సాధించింది. జిఎంసి అథ్లెటిక్ స్టేడియంలో ఏటికే మోహన్ బగాన్ జట్టుపై ముంబై 2-0తో గెలిచింది. 7వ నిమిషంలో మౌర్తాడ ఫాల్, 39వ నిమిషంలో బార్తోలోమ్యూ ఓగ్బెచ్ గోల్స్ బాదారు. దీంతో ముంబై తొలి భాగంలో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో భాగంలో ఏటికే ఒక్క గోల్ కూడా చేయలేకపోవడంతో ముంబై విజయం సాధించింది.
పాయింట్ల పట్టికలో ముంబై సిటీ, ఏటికే మోహన్ బగాన్, నార్త్ ఈస్ట్ యునైటెడ్, గోవా ఎఫ్సీ టాప్-4లో ఉన్నాయి. 20 మ్యాచులలో 12 విజయాలు అందుకుని 40 పాయింట్లతో ముంబై అగ్రస్థానంలో ఉంది. 20 మ్యాచులు ఆడిన ఏటికే 12 విజయాలతో 40 పాయింట్లు ఖాతాలో వేసుకుని రెండో స్థానంలో ఉంది. నార్త్ ఈస్ట్ ఎనమిది విజయాలతో 33 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. గోవా 7 విజయాలతో నాలుగో స్థానంలో ఉంది.