
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీ 2020-21 మిగిలిన సీజన్ కోసం ఎఫ్సీ ఈస్ట్ బెంగాల్ నైజీరియా ఆటగాడితో ఒప్పందం కుదుర్చుకుంది. నైజీరియా యువ ఫార్వర్డ్ బ్రైట్ ఎనోబాఖరే ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఈస్ట్ బెంగాల్ శుక్రవారం ప్రకటించింది. 22 ఏళ్ల ఎనోబాఖరే చివరిగా గ్రీక్ క్లబ్ ఏఈకే ఏథెన్స్ తరపున ఆడాడు. అతడు వోల్వర్హాంప్టన్ జట్టు తరఫున 43 మ్యాచులు ఆడి.. మూడు గోల్స్ చేశాడు. ఎనోబాఖరే జట్టులోకి రావడంపై ప్రధాన కోచ్ రాబీ ఫౌలర్ సంతోషం వ్యక్తం చేశాడు.
ఎఫ్సీ ఈస్ట్ బెంగాల్ జట్టుతో చేరడంపై బ్రైట్ ఎనోబాఖరే ఆనందం వ్యక్తం చేశాడు. 'ఈస్ట్ బెంగాల్ భారతదేశంలో అతిపెద్ద క్లబ్. అందులో భాగం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. నాకు సరికొత్త సవాలు ఎదురుకానుంది. ఇండియన్ సూపర్ లీగ్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అక్కడ నా సామర్థ్యం మేరకు రాణిస్తా' అని 22 ఏళ్ల ఎనోబాఖరే అన్నాడు. ఈస్ట్ బెంగాల్ ప్రస్తుతం పట్టికలో 10వ స్థానంలో ఉంది. ఆడిన ఏడు మ్యాచులలో మూడు డ్రాలు, నాలుగు ఓటములను చవిచూసింది.
ఐఎస్ఎల్ 2020-21 సీజన్లో భాగంగా గురువారం, శుక్రవారం మ్యాచులు లేవు. నూతన సంవత్సరం సందర్భంగా రెండు రోజులు మ్యాచులు షెడ్యూల్ చేయలేదు. శనివారం మళ్లీ మ్యాచ్ జరగనుంది. ముంబై సిటీ, కేరళ బ్లాస్టర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచులో ముంబై సిటీ ఫెవరేట్ జట్టుగా బరిలోకి దిగనుంది. ఏటీకే మోహన్ బగాన్ 17 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ముంబై సిటీ 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఎఫ్సీ గోవా (14), జంషెడ్పూర్ ఎఫ్సీ (13), బెంగళూరు ఎఫ్సీ (12) టాప్-5లో ఉన్నాయి.