
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఏడో సీజన్లో బెంగళూరు ఎఫ్సీ అద్భుత విజయం సాధించింది. గోవాలోని జిఎంసి స్టేడియంలో సోమవారం రాత్రి ముంబై సిటీ ఎఫ్సీతో జరిగిన మ్యాచులో బెంగళూరు 4-2తో ఘన విజయాన్ని అందుకుంది. పటిష్ట ముంబైని మట్టికరిపించి పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. బెంగళూరు విజయంలో క్లిటన్ సిల్వా, సునీల్ ఛెత్రి కీలక పాత్ర పోషించారు. ఇద్దరూ తలో రెండో గోల్స్ బాదారు.
మ్యాచ్ ఆరంభం అయిన తొలి నిమిషంలోనే క్లిటన్ సిల్వా గోల్ బాది బెంగళూరు ఎఫ్సీని 1-0తో నిలిపాడు. 22వ నిమిషంలో మరో గోల్ బాది బెంగళూరు ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. దీంతో తొలి అర్ధ భాగంలో ముంబైపై బెంగళూరు ఆధిపత్యం చెలాయించింది. 55వ నిమిషంలో ఆడమ్ లే ఫోండ్రే ముంబై తరఫున గోల్ చేశాడు. ఇక 57వ నిమిషంలో 200 మ్యాచ్ ఆడుతున్న సునీల్ ఛెత్రి గోల్ చేసి బెంగళూరు ఆధిక్యాన్ని పెంచాడు. 72వ నిమిషంలో ఫోండ్రే మరో గోల్ కొట్టాడు. ఇక 94వ నిమిషంలో ఛెత్రి మరో గోల్ చేసి బెంగళూరుకు విజయాన్ని అందించాడు.
తాజా విజయంతో బెంగళూరు ఎఫ్సీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. 18 మ్యాచులు ఆడిన బెంగళూరు 5 విజయాలు అందుకుని.. 22 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ముంబై 17 మ్యాచులలో 10 విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ రోజు హైదరాబాద్ ఎఫ్సీతో కేరళ బ్లాస్టర్ ఎఫ్సీ తలపడనుంది. వాస్కో డా గామాలోని తిలక్ మైదాన్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో హైదరాబాద్ ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగనుంది.
పాయింట్ల పట్టికలో ఏటికే మోహన్ బగాన్, ముంబై సిటీ, నార్త్ ఈస్ట్ యునైటెడ్ టాప్-3లో ఉన్నాయి. 17 మ్యాచులలో 11 విజయాలు అందుకుని 36 పాయింట్లతో ఏటికే అగ్రస్థానంలో ఉంది. 17 మ్యాచులు ఆడిన ముంబై 10 విజయాలతో 34 పాయింట్లు ఖాతాలో వేసుకుని రెండో స్థానంలో ఉంది. నార్త్ ఈస్ట్ ఆరు విజయలతో 26 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. గోవా ఎఫ్సీ, హైదరాబాద్ ఎఫ్సీ టాప్-5లో ఉన్నాయి.