మార్గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్ ఏడో సీజన్లో ముంబై సిటీ ఎఫ్సీ మరో అద్భుత ప్రదర్శన చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో ముంబై సిటీ జట్టు 3-1తో బెంగళూరు ఎఫ్సీపై విజయం సాధించింది. తాజా విజయంతో ముంబై సిటీ మళ్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ఏడో సీజన్లో ముంబై అద్భుత ఆటతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఆ జట్టు ఆటగాళ్లు సూపర్ ఫామ్లో ఉన్నారు.
ముంబై సిటీ తరఫున మౌర్తదా ఫాల్ (9వ), బిపిన్ సింగ్ (15వ), బర్తలోమే ఒగ్బెచె (85వ) తలో గోల్ కొట్టారు. బెంగళూరు నుంచి కెప్టెన్ సునీల్ ఛెత్రీ (79వ ని.) ఒక్కడే పెనాల్టీ సాయంతో ఓ గోల్ సాధించాడు. తొలి అర్ధ బాగంలోనే రెండు గోల్స్ చేసిన ముంబై.. పూర్తి ఆధిపత్యం చెలాయించింది. కాగా ఈ సీజన్లో ముంబైకి ఇది వరుసగా మూడో విజయం కాగా.. బెంగళూరుకు హ్యాట్రిక్ ఓటమి. గత ఎనిమిది మ్యాచ్ల్లో ఓటమెరుగని ముంబై సిటీ (22 పాయింట్లు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
ఐఎస్ఎల్ ఏడో సీజన్లో భాగంగా ఈరోజు ఈస్ట్ బెంగాల్ ఎఫ్సీ, ఎఫ్సీ గోవా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. గోవాలోని తిలక్ మైదాన్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈస్ట్ బెంగాల్ మరియు గోవా చివరిసారిగా 2018లో హీరో సూపర్ కప్లో తలపడ్డాయి. అప్పుడు బెంగాల్ 1-0 విజేతగా నిలిచింది. డుడు ఏకైక గోల్ చేశాడు. ఐఎస్ఎల్ టోర్నీలో మాత్రం ఇరు జట్లు తలపడడం ఇదే మొదటిసారి.
జట్లు:
ఈస్ట్ బెంగాల్: డెబ్జిత్ మజుందర్, డేనియల్ ఫాక్స్, స్కాట్ నెవిల్లే, మిలన్ సింగ్, బికాష్ జైరు, రాజు గైక్వాడ్, మట్టి స్టెయిన్మాన్, హౌబామ్ టోంబా సింగ్, ఆంథోనీ పిల్కింగ్టన్, మహ్మద్ రఫీక్, జాక్వెస్ మాగోమా.
గోవా: మొహమ్మద్ నవాజ్, ఇవాన్ గారిడో, జేమ్స్ డోనాచీ, రక్షకుని గామా, సెరిటన్ ఫెర్నాండెజ్, ఎడు బేడియా, లెన్ని రోడ్రిగ్స్, బ్రాండన్ ఫెర్నాండెజ్, అలెగ్జాండర్ జెసురాజ్, ఇగోర్ అంగులో, జార్జ్ ఓర్టాజ్.
దేన్ని తక్కువగా అంచనా వేయొద్దు.. ముఖ్యంగా భారత క్రికెట్ జట్టును: లక్ష్మణ్