
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఏడో సీజన్లో బెంగళూరు ఎఫ్సీ, చెన్నయిన్ ఎఫ్సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ గోల్ లేకుండానే ముగిసింది. శుక్రవారం గోవాలోని ఫటోర్డా మైదానంలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరు 0-0 సమంగా ముగిసింది. మ్యాచ్ ఆసాంతం గోల్ కోసం ఇరు జట్లు తీవ్రంగా ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదు. ఓ దశలో బెంగళూరు దూకుడు పెంచినా చెన్నయిన్ సమర్థంగా ఎదుర్కొంది. ఏడో సీజన్లో ఇదివరకు కూడా ఓ మ్యాచ్ గోల్ లేకుండానే ముగిసింది.
ఐఎస్ఎల్ ఏడో సీజన్లో ఇప్పటి వరకు 16 మ్యాచ్లు ఆడిన బెంగళూరు ఎఫ్సీ నాలుగు విజయాలు మాత్రమే అందుకుంది. 5 ఓటములు, 7 డ్రాలతో 19 పాయింట్లను ఖాతాలో వేసుకుని పట్టికలో ఆరో స్థానంలో ఉంది. మరోవైపు మాజీ చాంపియన్ చెన్నయిన్ ఎఫ్సీ 16 మ్యాచ్ల్లో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించింది. 5 ఓటములు, 8 డ్రాలతో 17 పాయింట్లతో 8వ స్థానానికి పరిమితమైంది. చెన్నయిన్ చివరి ఐదు మ్యాచులలో ఒక్క విజయాన్ని కూడా సాధించలేదు. మరోవైపు బెంగళూరు ఒక విజయం సాధించింది.
శనివారం జరిగే మ్యాచులో ఒడిశా ఎఫ్సీతో ఏటీకే మోహన్ బగాన్ తలపడనుంది. బాంబోలిమ్లోని ఫజిఎంసి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో ఏటీకే ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగనుంది. చివరి మ్యాచులో ఏటీకే విజయం సాధించగా.. ఒడిశా ఓడిపోయింది. ఏటీకే 27 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. ఒడిశా 8 పాయింట్లతో చివరిడైన 11వ స్థానంలో ఉంది.
పాయింట్ల పట్టికలో ముంబై సిటీ, ఏటికే మోహన్ బగాన్, గోవా ఎఫ్సీ టాప్-3లో ఉన్నాయి. 15 మ్యాచులలో 10 విజయాలు అందుకుని 33 పాయింట్లతో ముంబై అగ్రస్థానంలో ఉంది. 14 మ్యాచులు ఆడిన ఏటికే 8 విజయాలతో 27 పాయింట్లు ఖాతాలో వేసుకుని రెండో స్థానంలో ఉంది. గోవా జట్టు ఐదు విజయలతో 22 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్ ఎఫ్సీ, నార్త్ ఈస్ట్ యునైటెడ్ టాప్-5లో ఉన్నాయి.