
మార్గావ్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీ ఏడో సీజన్లో హైదరాబాద్ ఎఫ్సీ మరో ఆకట్టుకునే ప్రదర్శనతో మెరిసింది. లీగ్లో బలమైన జట్టు అయిన ఏటీకే మోహన్ బగాన్తో శుక్రవారం జరిగిన మ్యాచ్ను 1-1తో డ్రాగా ముగించింది. 54వ నిమిషంలో మన్వీర్ సింగ్ చేసిన గోల్తో మోహన్ బగాన్ 1-0తో ముందంజ వేసింది. రెండో అర్ధభాగంలో హైదరాబాద్ ఈ లెక్కను సరిచేసింది. 65వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను జావో విక్టర్ గోల్గా మలచడంలో హైదరాబాద్ మ్యాచ్ను డ్రా చేసుకుంది.
బలమైన జట్టు అయిన ఏటీకే మోహన్ బగాన్ను హైదరాబాద్ ఆటగాళ్లు మ్యాచ్ ఆసాంతం నిలువరించారు. మొదటి అర్ధభాగంలో మోహన్ బగాన్ కాస్త పైచేయి సాధించినా.. ఆ తర్వాత హైదరాబాద్ పుంజుకుంది. మ్యాచ్ మొత్తం రసవత్తరంగా సాగింది. లీగ్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లాడిన హైదరాబాద్ ఎఫ్సీ ఒక మ్యాచ్లో గెలుపొంది, 3 మ్యాచ్ల్లో డ్రా నమోదు చేసింది. 6 పాయింట్లతో పట్టికలో అయిదో స్థానంలో కొనసాగుతోంది.
శనివారం ఒడిశా, గోవా జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లాడిన గోవా ఒక మ్యాచ్లో ఓడి, మరో మ్యాచ్లో గెలుపొంది, ఇంకో రెండు మ్యాచ్ల్లో డ్రా నమోదు చేసింది. నాలుగు మ్యాచ్లాడిన ఒడిశా మూడు మ్యాచ్లో ఓడి, ఒకమ్యాచును డ్రా చేసుకుంది. ఈరోజటి మ్యాచులో గోవా ఫేవరేట్ జట్టుగా బరిలోకిదిగుతోంది. ఇక ఆదివారం రెండు మ్యాచులు జరగనున్నాయి.