
హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ఈ సీజన్తో అడుగుపెట్టిన హైదరాబాద్ ఎఫ్సి జట్టు లీగ్ను ఓటమితో ఆరంభించింది. శుక్రవారం మాజీ చాంపియన్ అట్లెటికో డి కోల్కతా (ఏటీకే)తో సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 0-5 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది.
గోల్స్ పరంగా ఐఎస్ఎల్లో కోల్కతా జట్టుకు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. 2015లో గోవా జట్టుతో జరిగిన మ్యాచ్లో కోల్కతా 4-0తో విజయం సాధించగా... ఇప్పుడు ఆ రికార్డుని బద్దలు కొట్టింది. ఆట ఆరంభం నుంచీ కోల్కతా ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. ఈ క్రమంలో కోల్కతా తరఫున డేవిడ్ విలియమ్స్ 25వ నిమిషంలో తొలి గోల్ నమోదు చేశాడు.
ఆ తర్వాత రాయ్ కృష్ణ 27వ నిమిషంలో రెండో గోల్ నమోదు చేసిన ఆధిక్యాన్ని పెంచాడు. ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో కోల్కతా ఆటగాళ్లు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తొలి అర్ధభాగంలోనే మూడు గోల్స్ నమోదు చేసిన కోల్కతా రెండో అర్ధభాగం చివర్లో మరో రెండు గోల్స్ కొట్టి అద్భుత విజయాన్ని సాధించింది.
కోల్కతా తరుపున విడ్ విలియమ్స్ (25వ, 44వ నిమిషాల్లో), గార్సియా (88వ, 90వ నిమిషంలో) చెరో రెండు గోల్స్ చేయగా... కృష్ణా రాయ్ (27వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. ఈ మ్యాచ్లో బంతి ఎక్కువ శాతం కోల్కతా ఆధీనంలోనే ఉంది. మరోవైపు హైదరాబాద్ స్టార్ ఆటగాళ్లు మార్సిలిన్హో, గైల్స్, రాబిన్ సింగ్ ఘోరంగా విఫలమయ్యారు.
టోర్నీలో భాగంగా శనివారం జరిగే మ్యాచ్లో ఒడిశాతో నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టు తలపడుతుంది.