
శుక్రవారం తెరలేవనున్న నాలుగో సీజన్
ఇండియన్ సూపర్ లీగ్ నాలుగో సీజన్కు శుక్రవారం తెరలేవనుంది. భారత్లో మరే టోర్నీ లేని విధంగా నాలుగు నెలల పాటు ఐఎస్ఎల్ వినోదం పంచనుంది. లీగ్లో మొత్తం 108 రోజులు మ్యాచ్లు జరగనున్నాయి. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికొ డీ కోల్కతాతో గతేడాది రన్నరప్ కేరళ బ్లాస్టర్స్తో తలపడనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.

108 రోజులు జరగనున్న టోర్నీ
2014లో ప్రారంభమైన ఇండియన్ సూపర్ లీగ్ తొలి సీజన్లో 70 రోజులు.. ఆ తర్వాతి రెండు సీజన్లలో 80 రోజుల చొప్పున జరిగింది. అయితే నాలుగో సీజన్లో మాత్రం ఈ టోర్నీని 108 రోజులకు పెంచారు. నవంబరు 17(శుక్రవారం) మొదలయ్యే ఈ లీగ్ మార్చి 18న ముగియనుంది. టాటా గ్రూప్ ఆధ్వర్యం లో జంషెడ్పూర్ ఎఫ్సీ, పుట్బాల్ ప్రొఫెషనల్ జట్టు బెంగళూరు ఎఫ్సీ ఈసారి లీగ్లో ప్రవేశించిన రెండు కొత్త జట్లు.

లీగ్లో మొత్తం 10 జట్లు
ఇంకా చెన్నయిన్ ఎఫ్సీ, గోవా ఎఫ్సీ, పుణె సిటీ ఎఫ్సీ, ముంబై సిటీ ఎఫ్సీ, ఢిల్లీ డైనమోస్ ఎఫ్సీ, నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీ సహా మొత్తం 10 జట్లు లీగ్ బరిలో దిగనున్నాయి. దేశంలోని 10 ప్రధాన నగరాల్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. గత మూడు సీజన్లలో 61 మ్యాచ్లు జరగగా ఈసారి 90 మ్యాచ్లకు లీగ్ విస్తరించింది. ఇక ఫైనల్ మార్చి17న కోల్కతాలో జరగనుంది. గత ఏడాది వరకు తుది జట్టులో ఆరుగురు విదేశీయులు, ఐదుగురు భారత ఆటగాళ్లు ఉండేవారు.

కొత్త నిబంధన ఇదే
కానీ ఈ సీజన్లో మైదానంలో ఆరుగురు భారత ఆటగాళ్లు ఉండాలన్న కొత్త నిబంధన తీసుకొచ్చారు. దీంతో తుది జట్టులో విదేశీయులు ఐదుగురే ఉంటారు. ఇప్పటివరకు జరిగిన మూడు సీజన్లలో అట్లెటికో డి కోల్కతా జట్టు రెండు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. 2014లో జరిగిన తొలి సీజన్తో పాటు 2016లో జరిగిన సీజన్లో కూడా ఆ జట్టే విజేత. రెండుసార్లూ అట్లెటికో.. కేరళ బ్లాస్టర్స్నే ఓడించడం విశేషం. 2015లో చెన్నయిన్ ఎఫ్సీ.. గోవాను ఓడించి టైటిల్ విజేతగా నిలిచింది.


Click it and Unblock the Notifications














