

హైదరాబాద్: ప్రకృతి బీభత్సానికి కేరళ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. కొద్ది రోజుల పాటు కురిసిన భారీ వర్షాల ఫలితంగా రాష్ట్రంలో చాలా వరకూ లోతట్టు ప్రాంతాలన్నీ జలమైయ్యాయి. చాలా మంది ఇల్లు కొట్టుకుపోయి.. తినడానికి తిండి కూడా లేని దయనీయ స్థితుల్లోకి బతుకులు చేజారిపోయాయి. వారికి చేయూతగా దేశ వ్యాప్తంగా సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరూ తరలి వస్తున్నారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా పలు ప్రచారాలు జరుగుతున్నాయి. సినిమా స్టార్లు.. కోట్లలో డబ్బులు విరాళంగా ఇచ్చారంటూ ప్రచారం జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఫుట్బాల్ దిగ్గజం.. స్టార్ ప్లేయర్ అయినటువంటి పోర్చుగల్ ఆటగాడు రొనాల్డొ ఏకంగా రూ.77 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించాడని ప్రచారం చేస్తున్నారు. రొనాల్డొ తానుగా స్పందించి 1.2 మిలియన్ అమెరికా డాలర్లను విరాళంగా ఇచ్చాడంటూ చెప్పుకొస్తున్నారు. రొనాల్డో ఏదో సామాజిక నాయకుడు అయిపోయినట్లుగా ఫొటోలు పెట్టి హ్యాట్సాఫ్.. హీరోలంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ, ఇవన్నీ ఆ నోటా ఈ నోటా వచ్చిన మాటలే కానీ, ఇందులో ఏ మాత్రం నిజం లేదంటున్నాయి విశ్వసనీయ వర్గాలు.
తలచుకుంటే రొనాల్డోకు రూ.77కోట్లు విరాళంగా ఇవ్వడం పెద్ద విశేషమేమీ కాదు. కేరళ వరద బాధితులకు సాయం చేయమని సోషల్ మీడియాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. అదే ట్యాగ్ను అనుసంధానం చేసి ఇలాంటి రూమర్లు కూడా వైరల్ అవుతున్నాయి. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ అనంతరం రియల్ మాడ్రిడ్ నుంచి బదిలీ ఒప్పందంలో భాగంగా యువెంటస్ క్లబ్ 10 కోట్ల 50 లక్షల యూరోలు (రూ. 846 కోట్లు)కు రొనాల్డొ అమ్ముడుపోయాడు.
ఆ తర్వాత విరామాన్ని ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన రొనాల్డొ అతని కుటుంబం తాను బస చేసిన హోటల్ సిబ్బంది అందించిన సేవలకు మెచ్చి ఏకంగా రూ.16లక్షలు టిప్గా ఇచ్చేశాడట. మొదటి రోజు నుంచే హోటల్ సిబ్బంది రొనాల్డో కుటుంబానికి ప్రత్యేకంగా సేవలు అందిస్తూ వచ్చారట. దీంతో వారి సేవలకు ముగ్ధుడైన ఈ ఫుట్బాలర్ ఏకంగా ఇంత భారీ మొత్తంలో టిప్గా ఇచ్చినట్లు తెలిసింది.