భారత్, పాకిస్తాన్ జట్లు ఎప్పుడు తలపడినా అది కేవలం ఆటకే పరిమితం కాదు. అది ఏ ఈట అయినా సరే. తాజాగా జరిగిన సాఫ్ ఛాంపియన్షిప్ 2023 ఫుట్బాల్ టోర్నీలో కూడా అదే జరిగింది. భారత్, పాకిస్తాన్ జట్లు బెంగళూరులోని శ్రీ కంఠీరవ అవుట్డోర్ స్టేడియం వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో జరిగిన గొడవ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ మ్యాచ్ తొలి అర్ధభాగం మరికాసేపట్లో ముగుస్తుందనగా.. పాకిస్తాన్, భారత్ జట్ల ఆటగాళ్లు మైదానంలోనే గొడవకు దిగారు. పాక్ జెర్సీ వేసుకొని ఉన్న ఒక ప్లేయర్ నుంచి భారత జట్టు మేనేజర్ ఇగొర్ స్టిమాక్ బంతిని తీసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో రెండు వర్గాల మధ్య పెద్ద గొడవ జరిగింది. రెండు జట్ల ప్లేయర్లు కుమ్ములాటకు దిగారు. అంపైర్లు సహా, సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగాల్సి వచ్చింది.

ఈ గొడవపై సీరియస్ అయిన అంపైర్లు.. భారత జట్టు మేనేజర్ స్టిమాక్కు రెడ్ కార్డ్ చూపించారు. అదే సమయంలో పాకిస్తాన్ మేనేజర్ షహజాద్ అన్వర్కు ఎల్లో కార్డ్ ఇచ్చారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో భారత జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మ్యాచ్ మొదలైన 10 నిమిషాల్లోనే అద్భుతమైన గోల్ చేశాడు. పాక్ గోల్ కీపర్ తడబాటును యూజ్ చేసుకన్న ఛెత్రీ గోల్ కొట్టాడు.
ఆ తర్వాత కాసేపటికే దక్కిన పెనాల్టీ కిక్ను కూడా ఛెత్రీ గోల్గా మలిచాడు. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి భారత జట్టు 2-0 ఆధిక్యంలో నిలిచింది. సెకండ్ హాఫ్లో లభించిన మరో పెనాల్టీ కిక్ను ఛెత్రీ మరో గోల్గా మలిచాడు. ఈ హ్యాట్రిక్తో అంతర్జాతీయ ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ చేసిన ఆసియా ప్లేయర్గా ఛెత్రీ రికార్డు సృష్టించాడు. అతనికితోడు ఉదాంత సింగ్ కుమామ్ మరో గోల్ చేయడంతో భారత జట్టు 4-0తో సూపర్ విక్టరీ సాధించింది. దీంతో ఎస్ఏఎఫ్ఎఫ్ ఛాంపియన్షిప్ గ్రూప్-ఏలో టేబుల్ టాపర్గా నిలిచింది.