భారత ఫుట్బాల్ జట్టు ఒక్క విజయం సాధించకుండా ఈ ఏడాదిని పేలవంగా ముగించింది. 2024లో 11 మ్యాచ్లు ఆడిన ఇండియా ఆరింట్లో ఓడింది, అయిదు మ్యాచ్లను డ్రాగా ముగించింది. సోమవారం గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో మలేషియాతో జరిగిన ఫిఫా ఫ్రెండీ మ్యాచ్ను 1-1తో డ్రా చేసుకున్న ఈ ఏడాదిని గెలుపే లేకుండా ముగించింది. వచ్చే ఏడాది మార్చిలో భారత్ తమ తర్వాతి అంతర్జాతీయ మ్యాచ్ ఆడనుంది.
అయితే మలేషియాతో జరిగిన మ్యాచ్లో భారత్ సులువుగా గోల్ సమర్పించింది. భారత గోల్కీపర్ గుర్ప్రీత్ సింగ్ చేసిన తప్పిదంతో 19వ నిమిషయంలో టర్మర్ పాలో గోల్ చేశాడు. బంతిని అందుకునేందుకు ముందుకు వెళ్లిన గుర్ప్రీత్ బౌన్స్ను అంచనా వేయలేకపోయాడు. బంతి అతని తలమీద నుంచి వెళ్లింది. మరోవైపు అక్కడే ఉన్న టర్మర్ పాలో ఆ సువర్ణావకాశాన్ని ఎలాంటి పొరపాటు లేకుండా సద్వినియోగం చేసుకున్నాడు. ఖాళీ గోల్పోస్టులోకి బంతిని సునాయాసంగా పంపాడు.

ఆ తర్వాత మలేషియా ఆధిక్యాన్ని సమం చేయడానికి భారత జట్టు తీవ్రంగా పోరాడింది. 39వ నిమిషంలో రాహుల్ భీకే ఇండియా ఖాతా తెరిచాడు. ఫెర్నాండెజ్ నుంచి వచ్చిన పాస్ను గొప్పగా గోల్గా మలిచాడు. అయితే అంతకుముందు భారత్కు రెండు అవకాశాలు చేజారాయి. ఫ్రీకిక్ను గోల్గా మలచలేకపోయారు. అలాగే సురేశ్ బంతిని గోల్పోస్ట్లోకి పంపడానికి ప్రయత్నించగా ప్రత్యర్థి గోల్కీపర్ అడ్డుకున్నాడు.

విరామం అనంతరం పోరు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఇరు జట్లు హోరాహోరీగా పోటీపడ్డాయి. భారత్ మెరుగైన డిఫెన్స్ చేసింది. 47వ నిమిషంలో ప్రత్యర్థి కిక్ను సందేశ్ సమర్థవంతగా అడ్డుకున్నాడు. ఇక అదనపు సమయంలో ఆధిక్యం కోసం మలేసియా తీవ్రంగా ప్రయత్నించింది. కానీ భారత్ ఆ అవకాశం ఇవ్వకపోవడంతో మ్యాచ్ను డ్రాగా ముగిసింది.