ముంబై: ఐసిసి వన్డే ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొనే భారత జట్టులో చాలా మంది ఆటగాళ్లు గాయాలతో ఉన్నారని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్సర్కార్ ఆవేదన వ్యక్తం చేశారు. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతున్న జట్టు ఆటగాళ్లు ఫిట్గా లేకపోవడం కలవరపెడుతోందని ఆయన పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
గత ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శన చేసిన యువరాజ్ సింగ్, మురళీ విజయ్ లాంటి ఆటగాళ్లను జట్టులోకి తీసుకోకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వారిద్దరిని జట్టుకు ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యకరమే కాకుండా దిగ్భ్రాంతికరమైన విషయమని ఆయన అన్నారు.
ఆస్ట్రేలియా సిరీస్లో భారత జట్టు రాణించకపోవడం ప్రపంచ కప్ పోటీల్లో ఆటతీరుపై ప్రభావం చూపబోదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ కప్ భిన్నమైన టోర్నమెంట్ అని, పెద్ద ఈవెంట్ అని, భారత జట్టు బాగా ఆడుతుందని ఆయన అన్నారు. పాకిస్తాన్ జట్టు కన్నా భారత జట్టు మెరుగ్గా కనిపిస్తోందని ఆయన అన్నారు.
యువరాజ్ సింగ్ మ్యాచ్ విన్నర్ అని, దేశీవాళీ క్రికెట్లో బాగా రాణించాడని ఆయన చెప్పారు. యువీ బౌలింగ్, ఫీల్డింగ్ రంగాల్లో బాగా పనికి వస్తాడని ఆయన అన్నారు ఇటీవల ఆస్ట్రేలియాలో బాగా రాణించిన మురళీ విజయ్ను ఎంపిక చేయకపోవడం కూడా ఆశ్చర్యకరమేనని ఆయన అన్నారు.

పాకిస్తాన్తో భారత్ తొలి మ్యాచ్ ఆడడం కలిసి వచ్చే విషయమని, పాకిస్తాన్పై విజయం సాధిస్తే భారత క్రికెటర్ల ఆలోచనా ధోరణే మారుతుందని, మిగతా టోర్నమెంటుపై దాని ప్రభావం ఉంటుందని ఆయన అన్నారు. పాకిస్తాన్ మ్యాచ్ ఫలితాన్ని బట్టి శిఖర్ ధావన్, అజింక్యా రహనే ఓపెనింగ్ జోడీపై మార్పు చేయాల్సి ఉంటుందని అన్నారు.
మూడో స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్కు దిగాలని చెప్పారు. ఓ బౌలింగునైనా విరాట్ కోహ్లీ తుత్తునియలు చేయగలడని, ఎక్కువ సేపు అతను ఉండడం అవసరమని వెంగ్ సర్కార్ అన్నారు. బౌలర్లు పరుగులను కట్టడి చేయడానికి ప్రయత్నించే బదులు వికెట్లు తీసుకోవడానికి ప్రయత్నించాలని ఆయన సూచించారు.
అత్యంత ప్రధానమైన టోర్నమెంట్ సందర్భంగా భారత బౌలర్లు ఫామ్ లేకపోవడం, ఫిట్ కాకపోవడం బాధాకరమైన విషయమని ఆయన అన్నారు. వన్డేల్లో స్పిన్నర్లు వికెట్లు తీసుకోవాల్సి ఉంటుందని, పరుగులను కట్టడి చేయడం సరిపోదని భారత స్పిన్నర్ల గురించి మాట్లాడుతూ అన్నారు.
స్టువర్ట్ బిన్నీ ముఖ్యమైన పాత్ర పోషించగలడని, కఠిన శ్రమ చేసే ఆల్ రౌండర్ అని, బంతిని బాగా మూవ్ చేయగలడని అన్నారు. భారత్ కాకపోతే, ఆస్ట్రేలియా లేదా దక్షిణాఫ్రికా కప్ గెలుచుకునే అవకాశాలున్నాయని వెంగ్ సర్కార్ అన్నారు.