టోర్నీ అంతా అద్భుతమైన ప్రదర్శనలతో సాఫ్ (ఎస్ఏఎఫ్ఎఫ్) ఛాంపియన్షిప్ ఫైనల్ చేరిన భారత జట్టు.. ట్రోఫీని ముద్దాడింది. ఇది భారత్కు వరుసగా 9వ టైటిల్ కావడం గమనార్హం. ఫైనల్లో కువైట్ను ఢీకొట్టిన భారత్కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. కువైట్ ప్లేయర్లు గోల్ కోసం ఎడతెరిపి లేకుండా ప్రయత్నించారు. ఈ క్రమంలో అల్ఖాల్దీ కీలకమైన గోల్ చేశాడు.
దీంతో భారత జట్టు వెనుకంజలో పడింది. అయినా సరే కువైట్ మాత్రం తమ దాడి ఆపలేదు. ఈ ఒత్తిడిని చక్కగా ఎదుర్కొన్న భారత జట్టు కూడా చాలా తెలివిగా గోల్ చేసింది. కెప్టెన్ సునీల్ ఛెత్రి తన వద్దకు వచ్చిన బంతిని సాహల్ వద్దకు పంపాడు. కువైట్ పెనాల్టీ బాక్స్ మధ్యలో ఉన్న సహాల్.. చాంగ్టే వైపు బంతిని పంపగా అతను గోల్ పూర్తి చేశాడు. దీంతో రెండు జట్ల స్కోర్లు 1-1తో సమానంగా నిలిచాయి.

ఆ తర్వాత రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయినా సరే గోల్ చేయడంలో మాత్రం ఎవరూ సక్సెస్ కాలేదు. ఈ క్రమంలో మ్యాచ్ను మరో 30 నిమిషాలు పొడిగించారు. ఈ ఎక్స్ట్రా టైంలో కూడా రెండు టీమ్స్ గోల్ చేయలేకపోయాయి. దీంతో మ్యాచ్ పెనాల్టీ షూటవుట్కు దారి తీసింది. ఈ షూటవుట్లో తొలి బంతి అందుకున్న భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి.. సూపర్ గోల్ చేశాడు.
ఆ తర్వాత వచ్చిన మరో ఇద్దరు భారత ప్లేయర్లు కూడా గోల్స్ సాధించారు. అదే సమయంలో కువైట్ తొలి ప్రయత్నంలోనే విఫలమైంది. అయితే మూడు గోల్స్ సాధించిన తర్వాత భారత్ కూడా ఒక ఛాన్స్లో ఫెయిలైంది. కానీ కువైట్ మిస్ కాలేదు. దీంతో స్కోర్లు 4-4తో సమమయ్యాయి. ఇలాంటి సమయంలో ఇండియా గోల్ కీపర్ గుర్ప్రీత్ మరోసారి అద్భుతమైన సేవ్తో జట్టును ఆదుకున్నాడు.
గుర్ప్రీత్ సూపర్ సేవ్తో భారత జట్టు 5-4తో ఫైనల్ గెలిచి, ఏకంగా తొమ్మిదోసారి సాఫ్ ట్రోఫీ ముద్దాడింది. భారత జట్టు సాఫ్ కప్పు అందుకోగానే బెంగళూరులోని కంఠీరవ స్టేడియం దద్దరిల్లేలా అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నారు. నెట్టింట కూడా అభిమానులు.. భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.