
హైదరాబాద్: భారత జాతీయ పుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి ఆటకు మయన్మార్ కోచ్ గెర్డ్ జేస్ ముగ్ధుడయ్యాడు. 2019 ఏఎఫ్సీ ఆసియా కప్ అర్హత టోర్నీలో భాగంగా భారత్కు వచ్చిన ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
2019 ఏఎఫ్సీ ఆసియా కప్ అర్హత టోర్నీ తొలి అంచె మ్యాచ్లో భాగంగా ఛెత్రి కొట్టిన గోల్ రెండు జట్ల మధ్య అంతరాన్ని చూపిందని గెర్డ్ ఈ సందర్భంగా చెప్పాడు. అంతేకాదు ఛెత్రిని 'అత్యంత డేంజరస్ ప్లేయర్'గా గెర్డ్ అభివర్ణించాడు.
అవకాశముంటే ఛెత్రికి మా దేశ పాస్పోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నాడు. 'భారత కెప్టెన్ చాలా కూల్గా ఉంటాడు. అంతేకాదు అతను చాలా ప్రమాదకరమైన ఆటగాడు. ప్రతిదాడులతో పాటు డిఫెన్స్లో అతన్ని నిలువరించకపోతే కష్టం' అని గెర్డ్ అన్నాడు.
'డిఫెండింగ్లో భారత్ జట్టు మంచి జోరుని ప్రదర్శిస్తోందని, ఎలాగైనా సరే భారత్ను నిలువరిస్తాం. ఈ మధ్య కాలంలో భారత్ సాధిస్తున్న విజయాలకు అభినందిస్తున్నానని, అయితే ఈ మ్యాచ్లో పాజిటివ్ ధృక్పథంతో ఆడుతాం' అని పేర్కొన్నాడు. ఇరు జట్ల మధ్య మంగళవారం మ్యాచ్ జరుగనుంది.