బెంగళూరు: గాయాలతో సతమతమవుతున్నా ఐ లీగ్ డిపెండింగ్ చాంపియన్ బెంగళూరు ఎఫ్ సి శుభారంభాన్ని అందుకున్నది. కంఠీరవ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో షిల్లాంగ్ లాజోంగ్ ఎఫ్ సి జట్టుపై 3 0 స్కోర్ తేడాతో విజయం సాధించింది. రినో అంటో, లాల్ థౌమ్మావియా రాల్టే, కీగన్ పెరీరా, సలాం రంజన్ సింగ్, లాల్చౌన్మవియా వంటి కీలక ప్లేయర్లు లేకుండానే బరిలోకి దిగిన సునీల్ ఛెత్రి సేన.. షిల్లాంగ్ లాజోంగ్ జట్టుపై విజయం సాధించింది. ఉదాంతాసింగ్ అత్యుత్తమ ప్రదర్శనతో మ్యాచ్లో చెలరేగిపోయాడు. జువాన్ జువాన్ ఆంటోనియో ఫెర్నాండెజ్, జాన్ జాన్సన్ వంటి సెంటర్ బ్యాక్, ఎవాగ్నేసన్ లింగ్డో, లన్నీ రోడ్రిడ్జ్ , కెమరూన్ వాట్సన్ మిడ్ పీల్డింగ్ తో బరిలో దిగిన సునీల్ ఛెత్రి సేనతోపాటు షిల్లాంగ్ లాజొంగ్ జట్టు పోటాపోటీగా తలపడ్డాయి.
ప్రారంభంలో షిల్లాంగ్ జట్టు దూకుడుగా షాట్లు కొట్టినా అదే క్రమాన్ని కొనసాగించలేకపోయింది. సునీల్ ఛెత్రిని ముందు వరుసలో ఉంచి, ఆయనకు మద్దతుగా కుర్రాళ్లు ఉదాంతా సింగ్, డానియల్ లాల్రింపుయాలను నిలిపిన బెంగళూరు ఎఫ్ సి హెడ్ కోచ్ అల్బర్ట్ రోచా వ్యూహం ఫలించింది. డిఫెండింగ్ చాంపియన్లుగా బెంగళూరు జట్టుకు తొలిసారి గోల్ చేసే అవకాశం ఉదాంతా సింగ్ రూపంలో 26వ నిమిషంలో గోల్గా మారింది.
ఇన్ సైడ్ ఏరియా నుంచి ఉదాంతా సింగ్ పంపిన బంతిని షిల్లాంగ్ లాజోంగ్ గోల్ కీపర్ విశాల్ కైథ్ అడ్డుకోలేకపోయాడు. ఫలితంగా ఉదాంతా సింగ్ పంపిన ఎరియల్ బాల్ నేరుగా గోల్ పోస్ట్ బాట పట్టింది. ఫస్టాఫ్ చివరి నిమిషంలో ఎవాగ్నేసన్ లింగ్డో పంపిన బంతిని డానియల్ మిస్సవ్వగా, ఉదాంతా మరోసారి గోల్ కొట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని విశాల్ కైథ్ అడ్డుకున్నాడు. ఆ బంతి సునీల్ ఛెత్రి చేతుల్లో పడింది.
తిరిగి కర్లింగ్ ద్వారా బంతిని గోల్ పోస్ట్ కు పంపినా నిష్ర్పయోజనమైంది. సెకండాఫ్లో అత్యధిక భాగం ఇరు జట్లు గోల్ చేసే అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాయి. షిల్లాంగ్ ప్లేయర్ జపనీస్ కుర్రాడు యూటో కినోవాకీ 60వ నిమిషంలో పంపిన బంతి గోల్ పోస్ట్ దరి చేరలేదు. 68వ నిమిషంలో ఉదాంతా సింగ్ డిఫెన్ వెనుక నుంచి ప్రీతం సింగ్ వద్ద నుంచి బాక్స్ ముందు బంతిని వెనక్కు తిప్పి నేరుగా గోల్ పోస్ట్ దారి మళ్లించడంతో బెంగళూరు ఖాతాలో రెండో గోల్ నమోదైంది.
77వ నిమిషంలోనూ ఉదాంతా సింగ్ బంతిని గోల్ పోస్ట్ కు పంపే ప్రయత్నాన్ని విశాల్ కైథ్ అడ్డుకున్నాడు. 80వ నిమిషంలో సేనా రల్టే ముందుకు వచ్చి గోల్ కొట్టడంతో బెంగళూరు విజయం ఖరారైంది. అంతకుముందు ఫస్టాఫ్ ముగిసిన తర్వాత 46వ నిమిషం, 50వ నిమిషంలోనూ గోల్ చేసే అవకాశాలు వచ్చినా సునీల్ ఛెత్రి సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

'కీలక ఆటగాళ్లు గాయాల బారీన పడినా, కొందరు సుదీర్ఘ ప్రయాణంతో ఆటకు దూరంగా ఉన్నా ఒకే సామర్థ్యం గల జట్టుతో బరిలోకి దిగాం. అద్భుతమైన ఆటగాళ్ల సెటప్ మాకు అందుబాటులో ఉంది' అని బెంగళూరు కోచ్ అల్బర్ట్ రోచా చెప్పాడు.
ఐజ్వాల్తో ఈస్ట్ బెంగాల్ మ్యాచ్ డ్రా
కోల్కతా: ఐజ్వాల్ ఎఫ్ సి జట్టుతో కోల్కతాలోని బారాసత్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఈస్ట్ బెంగాల్ స్ట్రయికర్ ఇవాన్ బుకెన్యా చివరి క్షణంలో చేసిన గోల్తో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు పరస్పరం పోటాపోటీగా గోల్స్ డిఫెన్స్ వ్యూహం అనుసరించాయి. టైటిల్ పై కన్నేసిన ఈస్ట్ బెంగాల్ జట్టు తొలి మ్యాచ్ లో పేలవ ప్రదర్శన కనబరిచింది.
ఐజ్వాల్ ఎఫ్ సి ఫ్లేయర్ గుర్విందర్ సింగ్ ఫస్టాఫ్ లో చేసిన గోల్ పాయింట్ ను మ్యాచ్ చివరి క్షణంలో ఈస్ట్ బెంగాల్ స్ట్రయికర్ ఇవాన్ బుకెన్యా చేసిన గోల్ సమం చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 15వ నిమిషంలో వెడ్సొన్ అంసెల్మె పంపిన బంతి నేరుగా అల్బినో గోమ్స్ చేతిలో పడింది.
ఫస్టాఫ్ ముగియడానికి ముందు విపరీతంగా పొగ మంచు కురవడంతో నెలకొన్న అననుకూల వాతావరణంలో గుర్వీందర్ సింగ్ పంపిన బంతి గోల్ పోస్ట్కు చేరిపోయింది. దీంతో స్థానిక ఈస్ట్ బెంగాల్ జట్టు మద్దతు దారులకు నిరాశ మిగిలింది. ఈస్ట్ బెంగాల్ కోచ్ మోర్గాన్.. ప్రత్యర్థి జట్టు ఐజ్వాల్ జట్టు డిఫెన్స్ వ్యూహాన్ని పూర్తిగా అడ్డుకోవాలని ఆదేశించడంతోపాటు జాకీ చంద్ స్థానే విల్లీస్ ప్లాజాను బరిలోకి దించాడు.
ఈ దశలో ఐజ్వాల్ రెండో గోల్ చేస్తుందన్న వాతావరణం మధ్య ఈస్ట్ బెంగాల్ గోల్ కీపర్ విజయవంతంగా అడ్డుకున్నాడు. ప్లాజా తన జట్టుకు గోల్ సాధించేందుకు గల అవకాశాలపై ద్రుష్టి సారించాడు. అతి దగ్గర నుంచి గోల్ చేసేందుకు గల అవకాశాలను ఐజ్వాల్ కీపర్ అల్బినో గోమ్స్ అడ్డుకున్నాడు. ఇవాన్ బుకెన్యా చివరి నిమిషంలో గోల్ సాధించడంతో ఓటమి నుంచి బయటపడ్డ ఈస్ట్ బెంగాల్ జట్టు.. ప్రస్తుత సీజన్ లో ఆత్మరక్షణ ధోరణి నుంచి బయట పడాల్సిన పరిస్థితిలో చిక్కుకున్నది.