
హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఆరో సీజన్లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) అరంగేట్రం చేయబోతున్నవిషయం తెలిసిందే. తొలిసారి ప్రాతినిధ్యం వహించబోతున్న హెచ్ఎఫ్సీ అధికారిక లోగోను శనివారం విడుదల చేశారు. హైదరాబాద్ నగర సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే చార్మినార్తో సహా విఖ్యాత కోహినూర్ డైమండ్ కలబోతతో లోగోను రూపొందించారు. 'హైదరాబాద్ ఫుట్బాల్ ఖ్యాతిని పునరుద్ధరించడం' అని శీర్షిక ఇచ్చారు.
ఆవిష్కరణ కార్యక్రమంలో హెచ్ఎఫ్సీ యజమానులు వరుణ్ త్రిపురనేని, విజయ్ మద్దూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్లబ్ సహ యజమాని వరుణ్ త్రిపురనేని మాట్లాడుతూ... 'భారత ఫుట్బాల్లో హైదరాబాద్కు 1910 నుంచి ప్రత్యేక గుర్తింపు ఉంది. 1910లో మాజిద్ టోర్నీని ఇక్కడే నిర్వహించారు. 1920-1950 మధ్య అయితే హైదరాబాద్ భారత్ ఫుట్బాల్ను శాసించింది' అని అన్నారు.
'హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ విశేష ఆదరణ చూరగొంటుందనే నమ్మకం ఉంది. హైదరాబాద్కు అప్పట్లో మంచి గుర్తింపు ఉంది. నగరంలో సందడి వాతావరణం నెలకొనడం ఖాయం. హైదరాబాద్ చరిత్రను దృష్టిలో పెట్టుకుని లోగోను డిజైన్ చేసాం. హెచ్ఎఫ్సీతో ఈ ప్రాంతంలో ఫుట్బాల్కు ఆదరణ పెరుగుతుంది' అని మరో సహ యజమాని విజయ్ మద్దూరి తెలిపారు. ఐఎస్ఎల్ ఆరో సీజన్ అక్టోబరు 20 నుంచి ప్రారంభం కానుంది. అక్టోబరు 25న హైదరాబాద్ తమ తొలి మ్యాచ్లో అట్లెటికో డి కోల్కతా (ఏటీకే)తో కోల్కతాలో తలపడతుంది.