దోహా: భారతదేశ ఫుట్బాల్ సరికొత్త చరిత్రలో నెలకొల్పే దిశగా అడుగులేస్తున్న బెంగళూర్ ఎఫ్ సి క్లబ్ జట్టు శనివారం దోహాలో జరిగే ఏషియాన్ ఫుట్బాల్ కాన్ఫిడరేషన్ కప్ (ఎఎఫ్సి) ఫైనల్స్లో ఇరాకీ ఎయిర్ ఫోర్స్ క్లబ్ జట్టుతో తలపడనున్నది. ఇటీవలి కాలంలో ప్రతిష్ఠాత్మక ఎఎఫ్సి టోర్నీ ఫైనల్స్లో భారత్ ఫుట్ బాల్ క్లబ్ జట్టు అడుగు పెట్టడమే ఒక రికార్డు. ఎఎఫ్సి కిరీటాన్ని ధరించాలన్న కలతో భారత్ టీం ఇప్పటికే దోహాకు చేరుకున్నది.
క్లబ్ ఏర్పాటైన మూడేళ్లలోనే ఎఎఫ్సి ఫైనల్స్ కు దూసుకెళ్లడంతో చరిత్ర స్రుష్టించిన బెంగళూరు జట్టు ఏ మ్యాజిక్ చేసిందన్న విషయమై అంతా ద్రుష్టిని కేంద్రీకరించారు. అటు బెంగళూరు జట్టుకు ప్రత్యర్థి జట్గుగా ఉన్న ఇరాకీ ఎయిర్ఫోర్స్ క్లబ్ జట్టు సైతం ఎఎఫ్ సి ఫైనల్స్లో అడుగు పెట్టడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. సుల్తాన్ బిన్ హమద్ స్టేడియంలో ఫైనల్స్ లో తమ సత్తా చూపేందుకు ఇరు జట్లు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి.
అయితే బెంగళూరు జట్టు అత్యంత ముఖ్యమైన ఈ మ్యాచ్ లో ఎటువంటి వ్యూహం అనుసరిస్తుంది? ఏం చేస్తుందన్న విషయమై భారతీయులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతి తక్కువ కాలంలో రెండు ఐ - లీగ్ టైటిళ్లు, ఒక ఫెడరేషన్ కప్ను ఎగరేసుకుపోయిన బెంగళూరు జట్టు అతి తక్కువ కాలంలోనే ఖండాంతర టోర్నీలో సంచలనాలు సాధించడం అంత తేలికేం కాదు. అనూహ్య రీతిలో ఖండాంతర టోర్నీలో పాల్గొంటున్న బెంగళూరు క్లబ్ ప్రాతినిధ్యంతోనే భారత్ లో ఫుట్ బాల్ కు పూర్వవైభవం, పున: శుభారంభాన్ని అందించే శుభ ఘడియలు వచ్చేశాయని అంతా భావిస్తున్నారు.

ఎఎఫ్ సి కప్ గెలుచుకోవడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్న బెంగళూరు జట్టు భారత్ అంతటా ఫుట్ బాల్ దిశగా పరివర్తన తీసుకురాగలరన్న ఆసక్తి కూడా అభిమానుల్లో కనిపిస్తున్నది. ఇందులో మరో గమ్మత్తేమిటంటే సెమీ ఫైనల్స్ దశలో బెంగళూరు జట్టు అధ్యంతం దూకుడుగా ఆడి.. ఎఎఫ్సి డిఫెండింగ్ చాంపియన్ జొహొర్ దారుల్ తాజిమ్ జట్టును 4 - 2 స్కోర్ తేడాతో మట్టికరిపించడం అందరినీ ఆశ్చర్య చకితులను చేసింది.
ఈ టోర్నీలో ఐదు వ్యక్తిగత గోల్స్ సాధించిన బెంగళూరు ఎఫ్ సి సారధి సునీల్ ఛెత్రి సొంత గడ్డపై జరిగిన సెమీ ఫైనల్స్ రెండో హాఫ్లో చెలరేగిపోయాడు. ప్రత్యర్థి ఇరాకీ ఎయిర్ ఫోర్స్ క్లబ్ జట్లు మిడ్ ఫీల్డర్ బషర్ రసన్, సెంటర్ బ్యాక్ ప్లేయర్ సమల్ సయీద్ గాయాలతో బాధపడుతుండటం బెంగళూరు జట్టుకు కలిసొచ్చే అంశమేనని భావిస్తున్నారు. బషర్ రసన్ ఇరాకీ ఎయిర్ ఫోర్స్ క్లబ్ జట్టులో మిడ్ ఫీల్డర్ అత్యంత కీలకమైన ప్లేయర్. అంతేకాదు ఈ ఏడాది టోర్నీలో మూడు గోల్స్ చేసి ఖండాంతర టోర్నీలో జట్టును పైనల్స్కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు సెంటర్ బ్యాక్ ప్లేయర్ సయీద్ సైతం గత 10 ఎఎఫ్ సి మ్యాచ్ ల్లోనూ మొదటి ప్రాధాన్యం కలిగిన ప్లేయర్ కావడం గమనార్హం.
ఇక బెంగళూరు జట్టు ఫస్ట్ ఛాయిస్ గోల్ కీపర్ అమరీందర్ సింగ్ పై సస్పెన్షన్ వేటు అమలులో ఉంది. డిఫెండర్ శంకర్ సంపింగిరాజ్, మిడ్ ఫీల్డర్ డార్రెన్ కాల్డెరియా, పుల్ బ్యాక్ ప్లేయర్ లాల్చౌన్మావాయి ఫనాయి ఇంకా పూర్తిగా గాయాల నుంచి కోలేకపోవడం జట్టు ఫ్రాంచైసీ యాజమాన్యాన్ని కలవర పెడుతున్నది. అయితే బెంచ్కే పరిమితమైన ఉదాంతా సింగ్ వంటి వారు ఏ మేరకు ప్రభావం చూపగలరన్న సంగతి వేచి చూడాల్సిందే.
బెంగళూరు కోచ్ అల్బర్ట్ రోసా మాత్రం తమ జట్టుపై ఎటువంటి ఒత్తిళ్లు లేవని, అత్యుత్తమ ప్రతిభను కనబర్చేందుకు తమ కుర్రాళ్లు సంసిద్ధంగా ఉన్నారని విశ్వాసం వ్యక్తంచేయడం ఆసక్తికర పరిణామం. 'ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్ అని ప్లేయర్లందరికీ తెలుసు. అదే సమయంలో ఇదే చివరి మ్యాచ్ అన్న విషయం తెలుసు. ఇదొక అదనపు మ్యాచ్ గానే భావిస్తున్నారు. ప్రొఫెషనల్ ప్లేయర్లుగా ప్రత్యర్థి జట్టు ఎయిర్ ఫోర్స్ క్లబ్ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశముందని అందరికి అవగాహన ఉంది' అని రోసా పేర్కొన్నారు.
ఎఎఫ్సి టోర్నీలోనే లీడింగ్ స్కోరర్ హమ్మదీ అహ్మద్ మాట్లాడుతూ టైటిల్ కోసం జరిగే పోరులో తమ అస్త్రశస్త్రాలన్నీ ప్రయోగిస్తామన్నాడు. తాము చాలా కష్టపడి ఆడాల్సి ఉంటుందని, అందుకు కారణం ఈ మ్యాచ్ ఎఎఫ్ సి ఫైనల్స్ కావడమేనన్నట్లు ఎఎఫ్ సి అధికారిక వెబ్ సైట్ పేర్కొంది. తమ తప్పులను తగ్గించుకోవడంపైనే తాము కేంద్రీకరించామని, అదే సమయంలో తమ ప్రత్యర్థులను గౌరవిస్తామని వ్యాఖ్యానించాడు. తాము తప్పక చాలా శక్తిమంతంగా మ్యాచ్ లో ప్రత్యర్థిని ఎదుర్కోవడంపైనే తమ ఫోకస్ ఉంటుందని ఈ ఎయిర్ ఫోర్స్ క్లబ్ కీలక ప్లేయర్ అహ్మద్ వ్యాఖ్యానించాడు.
ఇప్పటి వరకు బెంగళూరు జట్టు వెస్ట్ ఆసియా జట్లతో ఒక్క మ్యాచ్లో కూడా తలపడకపోవడం మరిచిపోవద్దని అంటున్నారు. కనుక ఇరాకీ క్లబ్ ప్లేయర్లు ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తారన్నది.. దానిని బెంగళూరు కుర్రాళ్లు ఎదుర్కోగలరా? అన్న విషయం వేచి చూడాల్సిందే మరి. 11 మ్యాచ్ లు ఆడిన ఎయిర్ ఫోర్స్ క్లబ్ 26 గోల్స్ సాధిస్తే వాటిలో 10 మ్యాచ్లలో మాత్రమే పాల్గొని 15 గోల్స్ సాధించి.. జట్టును ఫైనల్స్ వరకు తీసుకురావడంలో అహ్మద్ ఎంతో కీలకమైన పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుపొందినా వారంతా పది లక్షల డాలర్ల నగదు బహుమతితో ఒక్కసారిగా సంపన్నుల జాబితాలో చేరిపోవడం మాత్రం ఖాయమే మరి.