తొలి మ్యాచ్లో పోర్చుగల్ చేతిలో ఓటమి చవిచూసిన ఘనా.. రెండో మ్యాచ్లో సత్తా చాటింది. సౌత్ కొరియాతో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా పోరాడి 3-2తో విజయం సాధించింది. గ్రూప్ హెచ్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో తొలి అర్ధభాగంలోనే ఘనా పైచేయి సాధించింది. ఘనా ఆటగాళ్లు మహమ్మద్ సాలిసు, జోర్డాన్ ఆయూ ఇద్దరూ చెరో గోల్ చేయడంతో ఘనా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఫిఫా వరల్డ్ కప్ 2022లో తమ తొలి మ్యాచ్లో పోర్చుగల్తో ఘనా ఢీకొట్టింది. ఈ మ్యాచ్లో అద్భుతమైన పోరాట పటిమ చూపినప్పటికీ 3-2 తేడాతో ఓటమిపాలైంది. అదే సమయంలో తమ తొలి మ్యాచ్లో సౌత్ కొరియా కూడా కష్టపడినా ఫలితం దక్కలేదు. ఉరుగ్వేతో జరిగిన ఆ మ్యాచ్లో రెండు జట్లు ఒక్క గోల్ కూడా చెయ్యలేకపోయాయి. దీంతో అది డ్రాగా ముగిసింది. తొలి మ్యాచ్లో ఇలా చేదు అనుభవాలతో బరిలో దిగిన ఘనా, సౌత్ కొరియా రెండూ దూకుడుగా మ్యాచ్ ప్రారంభించాయి.
తొలి హాఫ్లో 59 శాతం సమయం బంతిని తమ వద్ద ఉంచుకున్నప్పటికీ సౌత్ కొరియా దాన్ని ఉపయోగించుకోలేకపోయింది. సరైన అవకాశాలను సృష్టించడంలో ఆ జట్టు ఆటగాళ్లు విఫలమయ్యారు. ఈ క్రమంలోనే తొలి అర్ధభాగంలో 2-0 తేడాతో వెనుకబడింది. ఇది చూసిన అందరూ ఇక విజయం ఘనాదే అని అనుకున్నారు. రెండో సగంలో మైదానంలో దిగిన సౌత్ కొరియా స్టార్ గీ-సుంగ్-చో అద్భుతంగా ఆడాడు.
సహచరులైన కాంగ్-ఇన్ లీ, జిన్-సు కిమ్ ఇద్దరు అందించిన షాట్లను అద్భుతమైన హెడర్లతో గోల్స్గా మలిచాడు. దీంతో రెండు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. ఒక్కసారిగా మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే తమ కంపోజర్ కోల్పోకుండా ప్రశాతంగా ఆడిన ఘనాకు 68వ నిమిషంలో మరో అవకాశం దక్కింది.
దాన్ని ఉపయోగించుకున్న ఘనా ప్లేయర్ మహమ్మద్ కుదుస్.. అద్భుతమైన గోల్తో తమ జట్టుకు ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత కొరియా చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో 3-2 తేడాతో కొరియాను ఓడించిన ఘనా.. నాకౌట్ రేసులో ముందడుగు వేసింది. ఇప్పటికే ఈ గ్రూప్ నుంచి పోర్చుగల్ నాకౌట్స్ చేరుకుంది. రెండో స్థానం కోసం ఉరుగ్వే, ఘనా పోటీ పడుతున్నాయి.