ప్రపంచ కప్ జోస్యాలు చెబుతున్న జంతువు ఆక్టోపస్ పై జర్మనీలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆక్టోపస్ ఒక్క జర్మనీలోనే కాదు...భారత్ తో సహా ప్రపంచంలోని అన్ని దేశాల్లోని క్రీడాభిమానుల్లో ఇప్పుడు ఆక్టోపస్ గురించే చర్చ. పాల్ అనే పేరున్న ఈ రెండేళ్ల వయసు గల ఎనిమిదికాళ్ల సముద్రజీవికి అభిమానులతో పాటు శత్రువులూ పెరిగారు. జర్మనీ ఆడే మ్యాచ్ల ఫలితాలన్నీ కచ్చితంగా అంచనా వేసి చెప్పిన పాల్... ప్రపంచవ్యాప్తంగా పెద్ద సెలబ్రిటీ అయింది. స్పెయిన్లో అభిమానులు దీని ఫొటోలు, బ్యానర్లు తీసుకుని నృత్యాలు చేస్తుంటే...జర్మనీ అభిమానులు మాత్రం నిప్పులుగక్కుతున్నారు. దానిని షార్క్ ట్యాంక్ లో పడేయాలంటూ ఓ జర్మనీ పత్రిక పెద్ద కథనం ప్రచురించింది. ఇక అభిమానులైతే... వేపుడు చేయాలని కొందరు, నిప్పుల్లో కాల్చుకుని తినాలని కొందరు, సీఫుడ్ సలాడ్ చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.
ఫుట్ బాల్ ఫలితాలను పాల్ (ఆక్టోపస్) ఊహించడం ఇదే మొదటిసారి కాదు. అది పుట్టిన తొలి రోజుల్లోనే యూరో 2008 ఫలితాలపై జోస్యం చెప్పింది. ఆ టోర్నీలో జర్మనీ ఆడిన మ్యాచ్ ల్లో 80 శాతం ఫలితాలను సరిగ్గా ఊహించింది. అయితే నాటి ఫైనల్లో స్పెయిన్పై జర్మనీ గెలుస్తుందని చెప్పింది. కాకపోతే జర్మనీ ఓడిపోయింది. ఈసారి ప్రపంచకప్ ఆరంభం నుంచి జర్మనీ ఆడే అన్ని మ్యాచ్ల ఫలితాలను కచ్చితంగా చెప్పింది. ఒక్కటి కూడా తప్పు కాలేదు. సెమీస్లో స్పెయిన్ చేతిలో జర్మనీ ఓడిపోతుందని చెప్పినా... యూరో ఫైనల్లో తప్పు జోస్యం చెప్పిందని, కాబట్టి ఏం కాదని అభిమానులు కొంత ధైర్యం చెప్పుకున్నారు. కానీ పాల్ చెప్పినట్లే ఫలితం వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఆక్టోపస్కు ఎంత క్రేజ్ వచ్చిందంటే... మ్యాచ్ అయిపోగానే 99 శాతం మంది అభిమానులు దీనినే గుర్తు చేసుకున్నారు. ఇంగ్లండ్ లో జన్మించిన ఈ ఆక్టోపస్ ప్రస్తుతం జర్మనీలో పెరుగుతోంది.
జర్మనీ ఓటమి తర్వాత...పాల్ ఉండే అక్వేరియంకు బెదిరింపుకాల్స్ మొదలయ్యాయి. దానిని చంపేస్తామని అనేకమంది అభిమానులు బెదిరిస్తూ ఫోన్లు చేస్తున్నారు. దాని సంరక్షకుడు నర్విసా మాత్రం...పాల్ ను కాపాడతానని హామీ ఇస్తున్నారు. 'మా ఆక్టోపస్ను చంపి తినాలని చాలామందికి ఉంది. అందుకే ఇలాంటి ఫోన్కాల్స్ చేస్తున్నారు. మేం ఇక్కడ ఉంది దానిని కాపాడటానికే. ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్కు ఎలాంటి ప్రమాదం రానివ్వం' అని నర్విసా చెప్పారు.
ఇప్పటివరకూ పాల్ కేవలం జర్మనీ ఆడే మ్యాచ్ ల గురించి మాత్రమే జోస్యం చెప్పింది. అయితే ఈసారి ఫైనల్కు కూడా దీనితో జోస్యం చెప్పించాలనే డిమాండ్ పెరిగింది. దీంతో అక్వేరియం నిర్వాహకులు ఫైనల్ కు ముందు జోస్యం చెప్పించే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. మూడో స్థానం కోసం జర్మనీ ఆడే మ్యాచ్కు ఎలాగూ పాల్ జోస్యం ఉంటుంది. ఈ జోస్యాన్ని నమ్మి జర్మనీ అభిమానులు భారీగా బెట్టింగ్కు దిగుతున్నారు. సెమీస్లో ఆక్టోపస్ జోస్యాన్ని నమ్మి స్పెయిన్పై పందెం కాసిన ఓ జర్మన్ అభిమాని ఏకంగా రూ.3 కోట్లు సంపాదించాడట.