హైదరాబాద్: 'నేను ఎంత పనికిమాలినా కోచ్ని అయినాసరే నా టీం నెగ్గాలనే కోరుకుంటా' అంటున్నాడు జెన్నారొ గట్టుసో. ఇటాలియన్ మాజీ ఫుట్బాలర్ అయిన గట్టుసో ఇటలీ ఫుట్బాల్ జట్టు ఏసీ మిలాన్కి కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఈ జట్టు సిరీస్-ఎ లో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ సిరీస్ను ఉద్దేశించి మాట్లాడిన గట్టుసో ఈ విధంగా స్పందించాడు.
కొప్పా ఇటాలియా లీగ్లో భాగంగా డిసెంబరు 28 బుధవారం మొదలైన మ్యాచ్లో ఏసీ మిలాన్ విజయం సాధించింది. ఏసీ మిలాన్కు ఇంటర్ మిలాన్కు మధ్య జరిగిన హోరాహోరీ పోరులో ఏసీ మిలాన్ జట్టే 1-0తేడా స్కోరుతో నెగ్గింది. లీగ్లో జరుగుతున్న సెమీ ఫైనల్స్ నేపథ్యంలో జట్టులోని ప్రతి కదలికను ప్రేక్షకులు ఉత్కంఠతో వీక్షించారు.
టీనేజ్ సెన్సేషన్గా పేరు తెచ్చుకున్న పాట్రిక్ క్యూట్రోన్ ఏసీ మిలాన్ జట్టు తరపుగా మళ్లీ హీరో అయ్యాడు. సాన్సిరో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ 105వ నిమిషంలో ఒకే ఒక గోల్ చేసి తన జట్టును గెలిపించాడు. వరుసగా ఓడిపోతున్న ఆరు మ్యాచ్ల అనంతరం కోచ్ గట్టుసోకు ఈ విజయం కొద్దిగా ఊపిరి పీల్చుకునేలా చేసింది.
సిరీస్-ఏలో ఆడిన రెండు మ్యాచ్లకు తీవ్రంగా శ్రమించామని అయినా పరాజయం పాలైయ్యామని అన్నాడు. ఓటమిలో నుంచి వాళ్ల ప్రయాణాన్ని మొదలుపెట్టానంటూ పేర్కొన్నాడు. ఇదే వారి విజయాల పరంపరకు తొలిమెట్టు అని తెలిపాడు. ఈ విజయానికి కృషి చేసిన తన జట్టు సభ్యులందరికీ అభినందనలు అందజేశాడు.
'వచ్చే జనవరితో నా వయసు 40సంవత్సరాలు నిండిపోతోంది. కానీ, నన్ను నేను ఇప్పటికీ ఓ క్రీడాకారుడిగానే భావిస్తా. నేను క్రీడాకారుడిగా ఉన్నప్పుడు అన్ని సాధించా. కోచ్గా ఉన్నప్పుడు అంతటి విజయాలను సాధించడానికి కొంచెం సమయం పడుతుంది. ఈ జట్టుకు ఎన్నో ఘన విజయాలు సాధించిన చరిత్ర ఉంది. జట్టులో సభ్యులు చాలా వరకు మారడంతో మళ్లీ సర్దుకోవాల్సి ఉంది.' అని అభిప్రాయపడ్డాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.