
హైదరాబాద్: ఒకప్పుడు రోడ్లపై తిరిగే అనాథ ఇప్పుడు ఫుట్బాల్ ఆటగాడు. ఏ ఆధారం లేకుండానే తన సోదరిని వెంటబెట్టుకుని పట్టణానికి వచ్చిన బాలుడి వ్యధ ఇది. 14 ఏళ్ల వయసున్న ఆర్.మణికందన్ ఏడేళ్ల వయసున్నపుడు తన సోదరిని వెంటబెట్టుకుని కేరళలోని కొల్లాం ప్రాంతాల్లో భిక్షమెత్తుకుంటూ తిరుగుతుండేవాడు. వాళ్లిద్దరినీ చూసి అనాథ శరణాలయం నడిపే శ్రీకుమార్ చేరదీశాడు. అంతే మణికందన్ జీవితం మారిపోయింది.
అతడి ఆశ్రమంలో పిల్లలు ఎక్కువ కావడంతో స్థలం లేక.. దగ్గర్లోని ఫాతిమా మాత కళాశాల మైదానం దగ్గర కొంతమందిని ఉంచాడు. అదే మైదానంలో కోచ్ అభిలాష్ ఆటగాళ్లకు ఫుట్బాల్లో శిక్షణ ఇస్తుండటంతో సరదాకి ఫుట్బాల్ ఆడుతూ ఆ కోచ్ కళ్లల్లో పడ్డాడు మణికందన్. అతడి ప్రతిభను గుర్తించి సీనియర్ ఆటగాళ్లతో ఆడే అవకాశం కల్పించాడు కోచ్.
ఫుట్బాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచి ఇప్పుడు స్పెయిన్ వెళ్లే అవకాశాన్ని దక్కించుకొన్నాడు. స్పెయిన్లో ఒక నెల శిక్షణ తర్వాత అతణ్ని అమెరికాకు పంపే అవకాశం కూడా ఉంది.
అండర్-16 ఆటగాడిగా చెన్నైలోని ఫుట్బాల్ ప్లస్ ప్రోఫెషనల్ సాకర్ అకాడమీకి మణికందన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతడి ప్రతిభ గుర్తించి చెన్నై అకాడమీ అధికారులు విదేశీ కోచ్లకు చెప్పి, ప్రత్యేక శిక్షణకు సిఫారసు చేశారు.
''మణికందన్ బిడియంగా ఉంటాడు. ఫుట్బాల్లో సాధించిన విజయాలే అతని గురించి మాట్లాడతాయి. మైదానంలో చిరుతలా పరిగెడుతూ ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తాడు'' అంటూ తాను చేరదీసిన కుర్రాడి గురించి శ్రీకుమార్ చెప్పాడు.
''గత జనవరిలో అతణ్ని చూశా. ఒక్క ఏడాదిలోనే చాలా అభివృద్ధి చెందాడు. అతను కచ్చితంగా భారత్ తరపున ఆడతాడు'' అని మణికందన్ ఫుట్బాల్ ప్రతిభను గుర్తించిన అభిలాష్ చెప్పాడు.
''ఫుట్బాల్ అంటే నాకు పిచ్చి. నేను ఆటగాడిగా మారానంటే ఆ ఘనత శ్రీకుమార్, అభిలాష్లకే చెందుతుంది. వాళ్లు నన్ను బాగా ప్రోత్సహించారు. మెస్సి అంటే చాలా ఇష్టం. భారత జెర్సీ వేసుకొని దేశం తరపున ఫుట్బాల్ ఆడాలనేదే నా లక్ష్యం'' అని మణికందన్ అంటున్నాడు.