గువాహటి: భారత ఫుట్బాల్ మాజీ కెప్టెన్, లెజెండరీ ఆటగాడు ప్రదీప్ కుమార్ బెనర్జీ గత శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా భారత దిగ్గజ మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు అబ్దుల్ లతీఫ్ కన్నుమూశారు. 73 ఏళ్ల లతీఫ్ సోమవారం రాత్రి గువాహటిలో తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జరిగాయి. లతీఫ్ జట్టు సభ్యులు, జిల్లా పరిపాలన ప్రతినిధులు కూడా అంత్యక్రియలలో పాల్గొన్నారు.
కరోనా పోరాటం కోసం ఫెదరర్ భారీ విరాళం.. ఎంతో తెలుసా?
1968లో బర్మాపై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన లతీఫ్.. 1970 ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత జట్టులో సభ్యుడు. కర్ణాటకలోని మైసూర్లో జన్మించిన ఆయన జాతీయ స్థాయి టోర్నీ సంతోష్ ట్రోఫీ (1966, 1968, 1970)లో బెంగాల్కు ప్రాతినిధ్యం వహించారు. వీటితో పాటు కోల్కతా విఖ్యాత క్లబ్లు మోహన్ బగాన్, మొహమ్మదాన్ స్పోర్టింగ్ జట్లకూ తన సేవలు అందించారు.
ఫుట్బాల్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాక మొహమ్మదాన్, అస్సాం జట్లకు అబ్దుల్ లతీఫ్ కోచ్గానూ వ్యవహరించారు. ఆయన శిక్షణలో అస్సాం జట్టు ఆటలో ఎంతో పురోగతి సాధించింది. అబ్దుల్ లతీఫ్ మృతి పట్ల అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) సంతాపం తెలిపింది. 'అబ్దుల్ లతీఫ్ ఇక లేరు అనేది చాలా విచారకరం. భారత ఫుట్బాల్కు ఆయన చేసిన సేవలు మరువలేనివి' అని ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షులు ప్రఫుల్ పటేల్ పేర్కొన్నారు.
ప్రదీప్ కుమార్ బెనర్జీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుతూ గత శుక్రవారం కోల్కతాలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. నిమోనియా కారణంగా శ్వాసకోశ సమస్యలతో సుదీర్ఘ కాలం పాటు ఆయన పోరాడారు. బెనర్జీకి ఇద్దరు కుమార్తెలు. పౌలా, పూర్ణ ఇద్దరు కుమార్తెలు ప్రఖ్యాత విద్యావేత్తలు. ఇక తమ్ముడు ప్రసూన్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. 1962లో జకార్తాలో జరిగిన ఆసియా గేమ్స్లో ప్రదీప్ కుమార్ బెనర్జీ స్వర్ణం సాధించారు. భారత్ తరఫున 84 మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించిన బెనర్జీ.. 65 గోల్స్ సాధించారు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆయన కోచ్గా కూడా పనిచేశారు.