న్యూఢిల్లీ: తాము వేధింపులు తాళలేక లెస్బియన్లుగా చెప్పుకునే వాళ్లమని, అన్ని స్థాయిల్లోను క్రీడాకారిణుల పైన లైంగిక వేధింపులు కనిపిస్తున్నాయని భారత్ మహిళా ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ సోనా చౌహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తన తాజా పుస్తకంలో షాకింగ్ అంశాలు వెల్లడించారు.
జాతీయ ఫుట్బాల్ జట్టులో సభ్యురాలిగా ఉన్నప్పుడు, జట్టులోని క్రీడాకారిణుల పట్ల జరిగిన లైంగిక వేధింపులు, అమానవీయ ఘటనల గురించి సోనా చౌదరీ తన తాజా పుస్తకంలో వెల్లడించారు. ఆమె 'గేమ్ ఇన్ గేమ్' పేరిట పుస్తకాన్ని విడుదల చేశారు.
టీమ్ మేనేజ్మెంట్, కోచ్, కార్యదర్శి... ఇలా ప్రతి ఒక్కరూ తమను లైంగికంగా వేధించేవారని, జట్టులోని ప్రతి క్రీడాకారిణికి ఈ వేధింపులు తప్పేవి కావని పేర్కొన్నారు. జట్టులో స్థానం కోసం క్రీడాకారిణులను లోబర్చుకునేందుకు ప్రయత్నాలు చేసేవారని, ఇది నిత్యకృత్యమైందని, లైంగిక వేధింపుల నుంచి తప్పించుకునేందుకు తాము లెస్బియన్ తరహాలో వ్యవహరించేవారమని పేర్కొన్నారు.
కేవలం జాతీయ జట్టులో మాత్రమే కాదని, రాష్ట్ర, ఇతర స్థాయిల్లోను మహిళల పైన వేధింపులు ఉన్నాయన్నారు. అలాంటి వాటికి రాజీపడలేక పలువురు మానసిక క్షోభ అనుభవించేవారన్నారు. విదేశీ పర్యటనల సందర్భంలో కోచ్లు, స్టాఫ్ సభ్యుల బెడ్లను మహిళా ఆటగాళ్ల గదిలో ఉంచేవారని, దీని గురించి అడిగితే పట్టించుకునే వాళ్లు కాదని పేర్కొన్నారు.
1998లో ఆసియా కప్ మ్యాచ్ సందర్భంగా సోనా చౌదరి మోకాలికి, వెన్నెముకకు గాయం అయింది. దీంతో ఆమె కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. ఆమె ప్రస్తుతం వారణాసిలో ఉంటున్నారు. ఆమె ఆరోపణల పైన కేంద్రమంత్రి సరబానంద్ సోనోవాల్ స్పందించారు. ఆరోపణలపై ఫిర్యాదు చేస్తే దర్యాఫ్తు జరిపిస్తామన్నారు.