మహారాష్ట్ర: కరోనా వైరస్ మహమ్మారితో భారత మాజీ ఫుట్బాల్ ఆటగాడు ఇలైదత్ హంజా కోయా మృతిచెందారు. కరోనా వైరస్ లక్షణాలతో కేరళలోని మల్లాపురంలో ఉన్న మంజేరి వైద్యకళాశాలలో మే 26 నుంచి చికిత్స పొందుతున్నారు. శ్వాస సమస్య తీవ్రమవడంతో ఆయన ఈ రోజు ఉదయం 6:30 గంటలకు తుది శ్వాస విడిచారు. దీంతో కేరళలో కరోనా మృతుల సంఖ్య 15కు చేరింది.
ఫుట్బాల్ మ్యాచ్కు 3 వేల మంది అభిమానులు.. ఒకర్నొకరు తాకుకుంటూ ఎంజాయ్!!
కేరళలకు చెందిన హంజా కోయా ముంబైలో స్థిరపడ్డారు. మహారాష్ట్ర తరఫున సంతోష్ ట్రోఫీలో ఆడారు. ముంబైలోని వివిధ ఫుట్బాల్ క్లబ్లకు ప్రాతినిథ్యం వహించారు. గత మార్చి నుండి మహారాష్ట్రలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో.. 61 ఏళ్ల హంజా కోయా కుటుంబంతో సహా మే 21న సొంత రాష్ట్రం కేరళలకు చేరుకున్నారు. మే 26న ఆయనలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి.
హంజా కోయా కరోనా లక్షణాలతో బాధపడుతూ మలప్పురంలోని మంజేరి మెడికల్ కాలేజీలో చేరారు. ఆయన న్యుమోనియా, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్తో బాధపడుతున్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. జూన్ 5న కోయా ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో.. రాష్ట్ర ఆరోగ్య శాఖ సలహా మేరకు మంజేరి ఆస్పత్రి వైద్యులు ఆయనకు ప్లాస్మా చికిత్స అందించారు. అయితే ప్లాస్మా థెరపీకి ఏమాత్రం కోలుకోలేదు. క్రమక్రమేనా ఆరోగ్యం క్షీణించి శనివారం ఉదయం 6:30 గంటలకు తుది శ్వాస విడిచారు.
హంజా కోయా కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురికి పాజిటివ్ అని తేలింది. కోయా భార్య, కొడుకు, కోడలు మరియు వారి పిల్లలిద్దరు కూడా కరోనా బారినపడినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతో వారికి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే 2,36,657 మందికి వైరస్ సోకింది. వేల సంఖ్యలో మృతులు ఉన్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది.