హైదరాబాద్: ఫుట్బాల్ దిగ్గజం డీగో మారడోనా గుర్తుగా భారత్లో ఓ మ్యూజియం ఏర్పాటు కాబోతోంది. ప్రపంచ స్థాయి మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేరళకు చెందిన వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ సోమవారం ప్రకటించారు. అందులో ప్రత్యేక ఆకర్షణగా మారడోనా బంగారు శిల్పాన్ని ఏర్పాటు చేయనున్నారు. గత నెల 25న గుండెపోటుతో మరణించిన మారడోనాకు బాబీ మంచి స్నేహితుడు. నగల వ్యాపారి అయిన అతను ఎనిమిదేళ్ల క్రితం మారడోనాను కేరళకు తీసుకొచ్చారు. ఈ మ్యూజియం కోల్కతాలో లేదా దక్షిణ భారత్లో నిర్మించే అవకాశం ఉంది.
'2011 నుంచి మారడోనాతో నాకు అనుబంధం ఉంది. తన రూపంతో ఉన్న చిన్న బంగారు విగ్రహాన్ని అతనికి అందించా. అది తీసుకున్న అతను తన ఎత్తుతో ఉన్న బంగారు శిల్పాన్ని చూడాలని ఉందనే కోరికను వ్యక్తపరిచాడు. అది కూడా 'ది హ్యాండ్ ఆఫ్ గాడ్' గోల్ను గుర్తుకు తెచ్చేలా ఉండాలన్నాడు. అతని కోరికను నిజం చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ మ్యూజియం అతనికి అంకితం. అందులో అతని వ్యక్తిగత, ఆటకు సంబంధించిన విశేషాలు పొందుపరుస్తాం' అని బాబీ చెమ్మనూర్ తెలిపాడు. బాబీ అంతర్జాతీయ సంస్థకు మారడోనా ప్రచారకర్తగా పనిచేశాడు.
సాంప్రదాయ, ఆధునికతల కలబోతగా ఈ మ్యూజియం ఉంటుందని బాబీ చెమ్మనూర్ పేర్కొన్నాడు. ఈ మ్యూజియం ద్వారా తాను లెజెండరీ ప్లేయర్కు ఘనమైన నివాళి అర్పించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఈ లెజెండరీ ప్లేయర్ను 2012లో వ్యాపారవేత్త, చెమ్మనూరు గ్రూప్ చైర్మన్ బాబీ చెమ్మనూర్ కేరళకు తీసుకొచ్చాడు. ఫుట్బాల్ దిగ్గజం డీగో మారడోనా గుండెపోటుతో ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. డీగో మరణంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కలత చెందారు.
మారడోనా ఆకస్మిక మరణంపై ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు తీవ్ర కలత చెందుతున్న సమయంలో.. డీగో మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. చికిత్సతో పాటు అత్యవసర సమయంలోనూ వ్యక్తిగత వైద్యులు సరిగ్గా స్పందించలేదని మారడోనా కుమార్తెలు ఇదివరకే ఆరోపించారు. ఆయనను ఆసుపత్రికి తరలించడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారు పేర్కొన్నారు. అంబులెన్స్ చేరుకునేందుకు అరగంటకు పైగా సమయం పట్టిందని, ఇది కచ్చితంగా మూర్ఖత్వమేనని మారడోనా తరపు న్యాయవాది అన్నారు. ఇలా మారడోనా మరణంపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో అర్జెంటీనా పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు.
సంచలన విషయాన్ని బయటపెట్టిన అంజూ.. ఒక్క కిడ్నీతోనే..!!