
ఢిల్లీ: 2022లో జరగనున్న ప్రతిష్టాత్మక మహిళల ఫుట్బాల్ ఆసియా కప్ ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకుంది. అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నీల ఆతిథ్యం కోసం గత కొన్నాళ్లుగా తీవ్రంగా శ్రమిస్తున్న అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఎట్టకేలకు ఫలితం సాధించింది. 1979లో చివరిసారి ఈ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన భారత్.. ఆ తర్వాత నాలుగు దశాబ్దాలుగా ( 41 ఏళ్లుగా) తిరిగి చాన్స్ దక్కించుకోలేకపోయింది.
మెగాటోర్నీ నిర్వహణకు భారత్ అనువైన వేదిక అని ఆసియా ఫుట్బాల్ కమిటీ (ఏఎఫ్సీ) శుక్రవారం తెలిపింది. 'ఏఎఫ్సీ మహిళల పుట్బాల్ కమిటీ సిఫార్సుల మేరకు టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్కు కట్టబెడుతున్నాం' అని ఏఎఫ్సీ కార్యదర్శి డాటో విండ్సర్ జాన్ తెలపారు. దీంతో ఏఐఎఫ్ఎఫ్ హర్షం వ్యక్తం చేసింది. 'మా ఆతిథ్యంపై నమ్మకముంచి ఈ అవకాశం ఇచ్చిన ఏఎఫ్సీకి ధన్యవాదాలు. టోర్నీని విజయవంతంగా నిర్వహిస్తాం' అని ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ పేర్కొన్నారు.
నలౖభ్లె ఏళ్ల క్రితం భారత్లో జరిగిన మహిళల ఆసియా కప్లో మన అమ్మాయిలు రన్నరప్గా నిలిచారు. 2016లో ఏఎఫ్సీ అండర్-16 చాంపియన్షిప్కు ఆతిథ్యమిచ్చిన భారత్.. 2017లో ఫిఫా అండర్-17 ప్రపంచకప్కు వేదికగా నిలిచింది. ఇప్పుడు ఈ అవకాశం రావడంతో భారత్లో ఫుట్బాల్ క్రేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని ఏఐఎఫ్ఎఫ్ కార్యదర్శి తెలిపారు.
2022 ద్వితీయార్థంలో జరిగే అవకాశం ఉన్న ఈ ఛాంపియన్షిప్లో 12 జట్లు పోటీపడబోతున్నాయి. గత టోర్నీలో ఎనిమిది జట్లే ఆడాయి. ఆతిథ్య హోదాలో భారత్ నేరుగా పాల్గొనబోతోంది. 2023 ఫిఫా ప్రపంచకప్కు ఈ ఛాంపియన్షిప్ను అర్హత టోర్నీగా పరిగణించనున్నారు.