న్యూఢిల్లీ: ఇండియన్ ఫుట్బాల్ ప్రీమియర్ లీగ్ 'ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) మూడో ఎడిషన్ టోర్నీ శనివారం అసోం రాష్ట్ర రాజధాని గౌహతిలో ప్రారంభం కానున్నది. గత రెండు సీజన్లలోనూ వివిధ దేశాల్లోని దిగ్గజ ఆటగాళ్లతోపాటు నవతరం కుర్రాళ్లు ఆ టోర్నీలో పాలుపంచుకుంటున్నారు. వీరందరిలో చెప్పుదగిన ఆటతీరు కనబరుస్తున్న వారిలో ఐదుగురు ప్రముఖ క్రీడాకారులు ఉన్నారు వారే. వారే గోవాకు ప్రాతినిధ్యం వహిస్తున్న లుసియా, తొలుత ఢిల్లీ డైనమోస్కు తర్వాత చెన్నైయిన్ ఎఫ్సి క్లబ్కు నేతృత్వం వహిస్తున్న జాన్ ఆర్నె రైస్, ముంబై సిటీలో భారత జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి, ప్రస్తుత ఢిల్లీ డైనమోస్కు ఫ్లోరెంట్మాలౌడా, అట్లెంటికో డీ కోల్కతాలో కీలక ఆటగాడు ఇయాన్ హుమ్లను ప్రముఖంగా పేర్కొనవచ్చు.
ఒక్కొక్క క్రీడాకారుడి గురించి తెలుసుకుందాం:
స్కాట్లాండ్లో జన్మించి కెనడా తరఫున ఫుట్బాల్కు ప్రాతినిధ్యం వహించిన ఇయాన్ హుమ్ తన ప్రాణానికంటే మిన్నగా ఆటను ప్రేమిస్తాడు. 2008లో ఇంగ్లండ్లో బార్న్స్లేకు ప్రాతినిధ్యం వహించిన ఓ మ్యాచ్లో తలకు గాయం కావడంతో వైద్యులంతా ప్రాణాలతో బతికి బట్టకడతాడా? అని అనుమానించారు. అనారోగ్య సమస్యలను అధిగమించి అదే సీజన్ టోర్నీలో ఆడటం హుమ్కే చెల్లు. ఇక తొలి ఐఎస్ఎల్ ఎడిషన్లో కేరళ బ్లాక్బస్టర్స్ ఫ్రాంచైసీతో ఒప్పందం కుదిరినప్పటి నుంచి శక్తిమంతమైన సెంటర్ ఫార్వర్డ్ క్రీడాకారుడిగా టోర్నీలోనే అసాధారణ క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గత ఏడాది నుంచి అట్లెంటికో డీ కోల్కతాకు ప్రాతినిధ్యం వహిస్తున్న హుమ్ 11 గోల్స్తో అత్యధిక గోల్స్ చేసిన రెండో క్రీడాకారుడిగా నిలిచాడు. క్రితం సీజన్లో జట్టు సారధి హెల్డర్ పొస్టిగ గాయంతో వైదొలగడంతో రెండోసారి టైటిల్ నిలబెట్టుకోవడంలో విఫలం అయ్యారు.
ముంబై సిటీ ఎఫ్సి క్లబ్ తరఫున ఆడుతున్న సునీల్ ఛెత్రి ఫుట్ బాల్ ప్రేమికులందరికీ సుపరిచితుడే. భారత ఫుట్బాల్ జట్టు సారధిగా గత ఏడాది ఐఎస్ఎల్లో అడుగుపెట్టాడు. వెటరన్ మాజీ మాంచెస్టర్ యునైటెడ్ ఫార్వర్డ్ డియాగో ఫోర్లాన్, ఛెత్రి భాగస్వామ్యంతో ఈ దఫా ఐఎస్ఎల్ చాంపియన్గా ముంబై సిటీ ఎఫ్సి నిలిచే అవకాశాలు మెండు. గత రెండు ఎడిషన్లలోనూ ముంబై సిటీ సెమీ ఫైనల్స్ దశకు చేరుకున్నా.. ఫైనల్స్ మెట్లెక్కెలేకపోయింది.

2006 వరల్డ్కప్ ఫైనలిస్ట్, ఫ్రాన్స్ మిడ్ ఫీల్డర్ ఫ్లోరెంట్ మాలౌడా ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో తిరుగులేని ఫార్వార్డ్ ఆటగాడిగా చెన్నైయిన్ను, దాని కోచ్ మాట్టరాజీ అంచనాలను తిప్పి కొట్టి.. ఢిల్లీని విజయ పథాన నడిపించాడు. 80 అంతర్జాతీయ మ్యాచ్లకు సారధిగా పనిచేసిన మాలౌడా ఇంగ్లీష్, చాంపియన్స్ లీగ్లో తన సత్తా చాటాడు.
డిపెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ ఎఫ్సి ఆటగాడు జాన్ ఆర్న్ రైస్ తొలి ఐఎస్ఎల్ సీజన్లో ఢిల్లీ డైనమోస్కు.. గత ఏడాది నుంచి చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఎడమ వైపు నుంచి దూరం నుంచే గోల్ పోస్ట్లోకి సాట్ కొట్టగల నేర్పు ఆయన సొంతం. మాజీ లివర్పూల్, రోమా ఆటగాడు ఏడేళ్లుగా లివర్పూల్ తరఫున సుమారు 250 మ్యాచ్లు ఆడిన ఘనత సాధించాడు. 2005 చాంపియన్స్ లీగ్ను మెర్సెసైడ్పై విజయం సాధించడం జాన్ ఆర్న్ రైస్ కెరీర్లోనే రికార్డు. నార్వేలోని మోల్డె సిటీలో జన్మించిన రైస్.. ఫ్రాన్స్, సైప్రస్ దేశాల ఫుట్బాల్ క్లబ్లకు ప్రాతినిధ్యం వహించాడు.
ఇక బ్రెజిల్కు చెందిన మరో దిగ్గజ క్రీడాకారుడు లుయికో. యూరోపియన్ జెయింట్స్ జువెంటస్, ఇంటర్ మిలన్, బాయెర్న్ మునిచ్ తరఫున, జపాన్లో 2002లో ప్రపంచ కప్ గెలుచుకున్న తర్వాత ఆయన కెరీర్ ముగిసిందని భావించారు. 38 ఏళ్ల లూయిస్, బ్రెజిల్కే చెందిన కోచ్ జికో మార్గదర్శకత్వంలో ఎఫ్సి గోవా సిటీ క్లబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత ఏడాది ఫైనల్స్కు చేరుకున్నా.. చెన్నైతో ఓటమి పాలైనా.. మ్యాచ్ తర్వాత విధించిన ఫైన్ జట్టుకు కోలుకోలేని దెబ్బ. ఈ సమస్యతో నిమిత్తం లేకుండా ఈ ఏడాది సవాల్ను ఎదుర్కొనేందుకు సిద్ధమని లూయికో పేర్కొన్నాడు. గోవాతో వరుసగా రెండో ఏడాది కాంట్రాక్ట్పై సంతకం చేసిన లూయిస్ మెరుగైన ఫలితం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశాడు.