
హైదరాబాద్: అత్యంత ఉత్కంఠభరితంగా మొదలైనా రోజులు మారే కొద్దీ.. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్పై క్రీడా అభిమానులకు ఆసక్తి పెరుగుతూనే ఉంది. అభిమానులకే కాదు, ఆటగాళ్లకు తోటి సిబ్బందికీ అదే స్థాయిలో ఉత్కంఠ. ఎలాగైనా మ్యాచ్ గెలవాల్సిందే లేదా నిష్క్రమణే అనుకుని తీవ్రంగా ప్రయత్నించిన అర్జెంటీనా మంగళవారం నైజీరియాపై విజయం సాధించింది.
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమంటే, ఆరు సంవత్సరాలుగా నిషేదం ఎదుర్కొంటున్న ఫిఫా మాజీ ప్రెసిడెంట్ ఈ సంవత్సరం స్టేడియం నుంచి మ్యాచ్ చూసేందుకు అనుమతి పొందాడు. ఇదిలా ఉంటే కళ్లు, చెవులు పనిచేస్తున్న వాళ్లు.. మ్యాచ్ ద్వారా దృశ్య, శ్రవణానందం పొందగలరు. మరి దివ్యాంగుల పరిస్థితో..! ఈ విషయానికి ప్రత్యామ్నాయం దొరికింది. కొలంబియన జట్టుకు చెందిన జూవాన్ అభిమాని జోస్ రిచర్డ్ గాల్లాగోన్కు ఫుట్బాల్ మ్యాచ్ అంటే అమితాసక్తి.
కానీ, తాను తొమ్మిది సంవత్సరాల వయస్సులో ఉండగా అనారోగ్యం కారణంగా దృష్టిని కోల్పోయాడు. దాంతో పాటుగా అతని వినికిడి శక్తి కూడా లోపించింది. ఈ పరిణామంతో ఎవ్వరికైనా ఫుట్బాల్ నుంచి ఆనందం పొందలేమోనని ఆసక్తి సన్నగిల్లుతుంది. కానీ, జోసెస్కు మాత్రం అలా జరగలేదు. అతని స్నేహితుడి సహాయంతో.. ఫుట్బాల్ మ్యాచ్ను ఇంకా అనుభూతి చెందుతూనే ఉన్నాడు. జోసెస్ స్నేహితుడు సీజర్ ఓ ఫుట్బాల్ నమూనాతో చిన్న బోర్డును తయారు చేశాడు.
వేళ్లతో తాకడంతో ఆ బోర్డర్లు తెలిసేలా డిజైన్ చేశారు. ఇక ఆటగాళ్ల కదలికలను చేతి రెండు వేళ్లను తిప్పుతూ ఆటగాళ్లు ఎలా ఆడారనే విషయాన్ని స్పర్శతో తెలుసుకునేలా ఏర్పాటుచేశాడు. దీంతో మ్యాచ్ మొత్తాన్ని చూసిన ఆనందాన్ని పొందుతున్నాడు జోసెస్. ఇలా కొలంబియా జట్టు తలపడిన మ్యాచ్ను స్నేహితుడికి చూపిస్తున్న వీడియోను ప్రముఖ క్రీడా ఛానల్ సోషల్ మీడియా ద్వారా ప్రచురించింది. దాంతో అది కాస్తా వైరల్గా మారింది.