హైదరాబాద్: మరి కొద్ది రోజుల్లో మొదలుకాబోతున్న క్రీడా సంరంభం ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ 2018కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అంతర్జాతీయ మ్యాచ్లో పాల్గొనేందుకు 32 దేశాల జట్లు రష్యా చేరుకున్నాయి. ఎనిమిది గ్రూపుల నుంచి ఒక్కో గ్రూపుకు నాలుగు జట్లుగా మొత్తం 32మంది తొలిదశ నుంచి పోటీపడనున్నాయి. రష్యా అతిథ్యమిస్తోన్న ఈ ఫిఫా వరల్డ్ కప్ నెలరోజుల పాటు అంటే జూన్ 14 నుంచి జులై 15 వరకు అభిమానులను అలరించనుంది.
వాస్తవానికి క్వాలిఫయిర్స్ టోర్నీని దాటి ఈ ఫిఫా వరల్డ్ కప్కు అర్హత సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడికొచ్చే ప్రతి జట్టూ నాణ్యమైనదే. కాబట్టి గ్రూప్ దశ అంత ఆషామాషీగా ఏమీ ఉండదు. ప్రతి మ్యాచ్ కీలకమే. ప్రతి ఫలితమూ ఉత్కంఠభరితంగానే ఉండబోతోంది.
ఈ వరల్డ్ కప్లో జర్మనీ, బ్రెజిల్ జట్లు ఫేవరేట్గా బరిలోకి దిగుతున్నాయి. అర్జెంటీనా, స్పెయిన్, బెల్జియం లాంటి జట్లు కూడా అద్భుతమైన ఫామ్లో ఉండటంతో వరల్డ్ కప్ రేసులో ఉన్నాయి. జూన్ 14న మాస్కోలోని లుజుంకి స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్లో ఆతిథ్య రష్యా.. సౌదీ అరేబియాతో తలపడనుంది.
ఈ సంరంభానికి ప్రారంభ వేడుకను అంతేస్థాయిలో నిర్వహించనుంది ప్రపంచ కప్ యాజమాన్యం. ఆ వేడుక ఏర్పాట్లు ఇలా ఉన్నాయి.
వేదిక:
ఆరంభ మ్యాచ్ జరుగుతున్న లూజుంకీ స్టేడియం వేదికగానే జూన్ 14న ఈ కార్యక్రమం కూడా జరగబోతోంది.
సమయం:
తొలి మ్యాచ్ రాత్రి 8: 30 గంటలకు మొదలవబోతుండగా దానికి సరిగ్గా అరగంట సమయంముందే ఆరంభ వేడుక ప్రారంభమవనుంది.
ముఖ్య అతిథులు:
అంగరంగ వైభవంగా భారీ స్థాయిలో నిర్వహించనున్న కార్యక్రమంలో 500 మంది వరకూ స్థానిక కళాకారులు పాల్గొననున్నారు. వారిలో డ్యాన్సర్లు, జిమ్నాస్ట్లు, విభిన్న రకాల కళాకారులు కలిసి దాదాపు స్టేడియంలోని 80వేల మంది వీక్షకులతో అలరించనున్నారు.
ఫిఫా అధికారిక వెబ్సైట్ సమాచారం ప్రకారం.. ప్రఖ్యాత సంగీత కళాకారుడు రాబీ విలియమ్స్, అతనితో పాటుగా రష్యన్ సొప్రనొ అయిడా గరిఫుల్లినా కూడా గొంతు కలపనుంది. ఈ ప్రదర్శన జరుగుతుండగా రెండుసార్లు ప్రపంచకప్ విజేత బ్రెజిల్ ప్రతినిధిగా రొనాల్డొ వేదికపై కనిపించనున్నాడు. వారితో పాటుగా విల్ స్మిత్, నిక్కీ జామ్లు కలిసి టోర్నమెంట్ సాంప్రదాయ గీతమైన 'లివ్ ఇట్ అప్'ను ఆలపించనున్నారు.