హైదరాబాద్: ప్రపంచ కప్ గెలుచుకోవాలనే ఆశతో టోర్నీలో అడుగుపెట్టిన అర్జెంటీనా.. ఇప్పటి వరకూ విజయం నోచుకోలేకపోయింది. అయినా మళ్లీ గెలవాలనే ఆశతో బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో.. కెరీర్లో చివరి ప్రపంచకప్ ఆడుతున్న అర్జెంటీనా స్టార్ ఫుట్బాలర్ లియోనల్ మెస్సీపై తాము ఏమాత్రం దయ చూపబోమని నైజీరియా కోచ్ జెర్నాట్ వెల్లడించాడు. ఫిఫా ప్రపంచకప్ ఆరంభం నుంచి ఘోరంగా విఫలమవుతున్న మెస్సీ.. ఇప్పటి వరకు కనీసం ఒక గోల్ని కూడా నమోదు చేయలేకపోయాడు.
ఫిఫా వరల్డ్ కప్లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
దీంతో.. గ్రూప్-డిలో ఉన్న అర్జెంటీనా జట్టు ఒక పాయింట్తో చివరి స్థానానికి పరిమితమైంది. ఆ జట్టు నాకౌట్ ఆశలు నిలవాలంటే ఈరోజు రాత్రి నైజీరియాతో జరగనున్న మ్యాచ్లో తప్పక గెలవాల్సి ఉంది. సుదీర్ఘకాలంగా ఫుట్బాల్ ఆడుతున్న మెస్సీ.. ఒక ప్రపంచకప్ని కూడా గెలవలేకపోయాడు. దీంతో.. ఈరోజు ఒకవేళ అర్జెంటీనా ఓడితే.. అతని కెరీర్ అసంపూర్తిగానే ముగియనుంది. ఎందుకంటే.. 31 ఏళ్ల మెస్సీకి ఇదే ఆఖరి ప్రపంచకప్ అని ఇప్పటికే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
'లియోనల్ మెస్సీ గొప్ప ఆటగాడు. మేమే కాదు.. అందరూ అతడి ఆటని ప్రేమిస్తారు. అయితే.. మేము మెస్సీ ఆడుతుంటే చూసేందుకు ఇక్కడికి రాలేదు. మ్యాచ్లను గెలిచేందుకు వచ్చాం. మేము ప్రొఫెషనల్ ఆటగాళ్లం.. మా దేశాన్ని గెలిపించడం మా విధి. లియోనల్ మెస్సీకి ఇదే ఆఖరి ప్రపంచకప్ అంటున్నారు. కానీ.. ఫుట్బాల్లో జాలి, దయకి చోటు లేదు. అందరూ గెలుపు కోసమే ప్రయత్నిస్తారు' అని నైజీరియా కోచ్ జెర్నాట్ వెల్లడించాడు.
ఈ క్రమంలో.. గ్రూప్-డిలో ఆఖరి కీలక మ్యాచ్కు అర్జెంటీనా సిద్ధమైంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ స్ట్రైకర్గా వెలుగొందుతోన్న మెస్సీ మీదే అర్జెంటీనా జట్టు భారం వేసింది. మెస్సీ మ్యాజిక్ చేస్తే అర్జెంటీనాకు తిరుగుండదు. మరి మెస్సీ ఈ సారైనా టార్గెట్ మిస్ అవ్వకుండా తన జట్టును ప్రీ క్వార్టర్ఫైనల్ రౌండ్ చేరుస్తాడో లేదో మంగళవారం జరగనున్న మ్యాచ్లో తేలనుంది.