
హైదరాబాద్: చెవిటి పిల్లి చెవిల్లె చెప్పిందే జరిగింది. ఫిఫా వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్లో ఆతిథ్య రష్యా విజయం సాధించింది. గురువారం ఆరంభ వేడుకల అనంతరం మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో ఆతిథ్య రష్యా జట్టు సౌదీ అరేబియాపై 5-0తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్ ఆరంభం నుంచీ సౌదీ అరేబియాపై రష్యా ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. ఈ మ్యాచ్ ప్రధమార్ధంలో రెండు గోల్స్ చేసిన రష్యా... ద్వితీయార్ధంలో మరింతగా దూకుడుగా ఆది మూడు గోల్స్ చేసింది. బంతిని పూర్తిగా రష్యా నియంత్రణలో ఉంచుకొని వీలు చిక్కినప్పుడల్లా గోల్స్ చేస్తూ ప్రత్యర్ధి జట్టుపై ఒత్తిడి పెంచింది.
ఆట ప్రారంభమైన 12వ నిమిషంలో రష్యా ఆటగాడు ఘజిన్కే గోల్ చేయగా, ఆ తర్వాత 43వ నిమిషంలో చేరిసేవ్ మరో గోల్ చేసి తొలి అర్ధభాగం ముగిసే సరికి రష్యాకు 2-0 ఆధిక్యం అందించారు. ఇక, రెండో అర్ధభాగంలో రష్యా ఆటగాళ్లు మరింతగా రెచ్చిపోయారు. రష్యా తన ప్రత్యర్ధి గోల్ పోస్టుపై 13 సార్లు దాడి చేయగా సౌదీ అరేబియా కేవలం డిఫెన్స్కే పరిమితమైంది.
విరామం అనంతరం రక్షణాత్మక ధోరణిలో ఆడిన ఇరుజట్లు మరో గోల్ సాధించడనికి చాలా సమయం పట్టింది. ప్రత్యర్ధి గోల్ పోస్టుపై పదే పదే దాడులు చేశారు. ఈ క్రమంలో 67వ నిమిషంలో గోల్ చేసి అవకాశం రష్యాకు వచ్చిన దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆ తర్వాత 72వ నిమిషంలో డెనిస్ చెరిచేవ్ మూడో గోల్ చేయగా, మరి కాసేపట్లో ఆట ముగుస్తుందనగా మరో రెండు గోల్స్ చేసి రష్యా ఆధిక్యాన్ని 5-0కు పెంచారు. దీంతో రష్యా ఎనిమిది నెలల తర్వాత విజయాన్ని సాధించింది.
ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసిన చేరిసేవ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, ఆరంభ మ్యాచ్లో గెలుపెవరిది? అంటే.. ఆతిథ్య జట్టు రష్యాకే తన ఓటు అని చెవిటి పిల్లి అచిల్లె చెప్పింది. సరిగ్గా చెవిటి పిల్లి అచిల్లె చెప్పినట్లే రష్యా విజయం సాధించింది. వరల్డ్ కప్ మ్యాచ్ ఫలితాలను అంచనా వేయడానికి అచిల్లెకు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన సంగతి తెలిసిందే.