హైదరాబాద్: పుట్బాల్ను అమితంగా ప్రేమించే తెలుగు అభిమానులకు ఇది నిజంగా శుభవార్త. మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానున్న ఫిఫా వరల్డ్కప్ ఫుట్బాల్ పోటీలను తెలుగులోనూ ప్రసారం చేయనున్నట్టు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ వెల్లడించింది.
ఇంగ్లీషుతో పాటు ప్రాంతీయ భాషలు బెంగాలీ, మళయాలం, తమిళం, తెలుగు భాషల్లో ఫిఫా వరల్డ్ కప్ అన్ని మ్యాచ్లను ప్రసారం చేయనున్నట్లు సోనీ సంస్ధ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇటీవల కాలంలో ఇంగ్లీషు భాషతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా క్రీడలకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018 సీజన్ను ప్రాంతీయ భాషల్లో స్టార్ నెట్ వర్క్ ప్రసారం చేసి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులను దక్కించుకున్న సోనీ సంస్ధ కూడా మ్యాచ్లను ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేసేందుకు ముందుకొచ్చింది.
'పుట్బాల్ ఎక్స్ట్రా' పేరుతో మ్యాచ్కి ముందు మ్యాచ్ తర్వాత లైవ్ స్టూడియో ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది. రష్యా అతిథ్యమిస్తోన్న ఈ ఫిఫా వరల్డ్ కప్ నెలరోజుల పాటు అంటే జూన్ 14 నుంచి జులై 15 వరకు అభిమానులను అలరించనుంది. ఈ వరల్డ్ కప్లో మొత్తం 32 దేశాలు పాల్గొంటున్నాయి.
నాలుగేసి జట్లు.. ఎనిమిది గ్రూప్లుగా విడిపోయి తొలి దశలో తలపడుతున్నాయి. ఈ పుట్బాల్ వరల్డ్ కప్ కోసం సాకర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన సాకర్ అభిమానులు రష్యాకు చేరుకున్నారు. జూన్ 14న మాస్కోలోని లుజుంకి స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్లో ఆతిథ్య రష్యా.. సౌదీ అరేబియాతో తలపడనుంది.