
హైదరాబాద్: గడిచిన గురువారం అర్జెంటీనా జట్టు క్రొయేషియాతో మ్యాచ్ ఆడి ఓడిపోయింది. ఈ ఓటమితో మనస్తాపానికి గురైన అర్జెంటీనా జట్టు అభిమాని (కేరళ వాస్తవ్యుడు) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలా తమ అభిమాన జట్టు ఓటమికి గురైతే తీవ్ర వేదన అనుభవించే ఆటగాళ్లు లేకపోలేదు. కేవలం వీక్షకులే అలా చేస్తారనుకుంటే పొరబాటే. ప్రపంచ కప్ మెగా టోర్నీలో తమ అభిమాన జట్టు ఈజిప్టు ఓడిపోయిందని మ్యాచ్కు కామెంటేటరీ చెప్తున్న వ్యక్తే గుండెపోటుతో మరణించాడు.
ఫిఫా వరల్డ్ కప్లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
ప్రస్తుతం రష్యా వేదికగా ఫిఫా ప్రపంచకప్ పోటీలు అనూహ్య రీతిలో అంచనాలకు మించి జరుగుతూ.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తుది-16లో చోటు కోసం ప్రతి జట్టు ఆద్యంతం పోరాడుతూనే ఉంది. ఈ క్రమంలోనే టోర్నీలో భాగంగా సోమవారం సౌదీ అరేబియా-ఈజిప్ట్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈజిప్టు మాజీ ఫుట్బాల్ ఆటగాడు అబ్దెల్ రహీం మహమ్మద్ ప్రస్తుతం కామెంటేటర్గా, విశ్లేషకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో సోమవారం సౌదీ అరేబియా-ఈజిప్టు మ్యాచ్లో భాగంగా నైల్ స్పోర్ట్స్ అనే ఛానల్లో ఏర్పాటు చేసిన చర్చలో మొహమ్మద్ పాల్గొన్నాడు. రెండూ జట్లు ఒక్కో గోల్ చేశాయి. ఈ మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని అనుకున్నారంతా. కానీ, ఎవరూ ఊహించని రీతిలో 90+5వ నిమిషం వద్ద సౌదీ అరేబియా ఆటగాడు సలేం అల్ దవ్సారి గోల్ కొట్టడంతో ఆ జట్టు విజయం సాధించింది. ఈ ప్రపంచకప్లో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడి గ్రూప్లో అట్టడుగు స్థానంతో ఈజిప్టు టోర్నీ నుంచి నిష్ర్కమించింది.
దీంతో మ్యాచ్ విశ్లేషణలో పాల్గొన్న మొహమ్మద్ షాక్కు గురైయ్యాడు. అనూహ్య రీతిలో సౌదీ అరేబియాకు విజయం అందిన తీరును తట్టుకోలేకపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై.. ఉన్నట్టుండి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.