
స్పార్టక్ మైదానానికి వచ్చిన మారడోనా
శనివారం అర్జెంటీనా, ఐస్ల్యాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం మారడోనా స్పార్టక్ మైదానానికి వచ్చాడు. గ్యాలరీ నుంచి మ్యాచ్ వీక్షించే సమయంలో మారడోనా పొగ తాగుతూ కనిపించాడు.
స్టేడియం లోపల పొగ తాగిన మారడోనా
అయితే, వరల్డ్ కప్ పోటీలు జరిగే సమయంలో అభిమానులు పొగతాగేందుకు గతంలో అనుమతి ఉంది. ప్రస్తుతం రష్యాలో జరుగుతున్న వరల్డ్ కప్ పోటీల్లో స్టేడియం లోపల పొగ తాగడంపై టోర్నీ నిర్వాహకులు నిషేధం విధించారు. దీంతో మారడోనాపై చర్యలు తీసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
ఇన్స్టాగ్రామ్ ద్వారా క్షమాపణ కోరిన మారడోనా
ఈ విషయం తెలిసిన మారడోనా ఆదివారం తన ఇన్స్టాగ్రామ్ ద్వారా క్షమాపణ కోరాడు. "స్టేడియంలో పొగ తాగకూడదన్న కొత్త నిబంధన గురించి నాకు నిజంగా తెలియదు. టోర్నీ నిర్వాహకులతో పాటు ప్రతి ఒక్కరినీ క్షమాపణలు కోరుతున్నాను" అని మారడోనా పేర్కొన్నారు.

క్రొయేషియాను ఢీకొట్టనున్న అర్జెంటీనా
ఇదిలా ఉంటే అర్జెంటీనా, ఐస్ల్యాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఆట ముగిసే సమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆట తొలి అర్ధభాగంలోనే ఈ రెండు గోల్స్ నమోదవడం విశేషం. ఇక, రెండో అర్ధభాగంలో ఇరు జట్లు గోల్ కోసం విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ.. గోల్ మాత్రం నమోదు కాలేదు. పెనాల్టీ రూపంలో అర్జెంటీనాకు వచ్చిన అవకాశాన్ని మెస్సీ గోల్గా మలచడంలో విఫలమయ్యాడు. దీంతో తొలిసారి ప్రపంచకప్లో ఆడే అవకాశం దక్కించుకున్న పసికూన ఐస్ల్యాండ్ జట్టు అర్జెంటీనా జట్టుకు గట్టి పోటీ ఇచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. టోర్నీలో భాగంగా అర్జెంటీనా తన తదుపరి మ్యాచ్లో క్రొయేషియాతో తలపడనుంది.


Click it and Unblock the Notifications














