
హైదరాబాద్: ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో భాగంగా గ్రూపు-డి నుంచి శనివారం స్పార్టాక్ స్టేడియంలో అర్జెంటీనా, ఐస్ల్యాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ ఆరంభం నుంచి హోరాహోరీగా ఇరు జట్లు తలపడ్డాయి. ఆట ముగిసే సమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఆట తొలి అర్ధభాగంలోనే ఈ రెండు గోల్స్ నమోదవడం విశేషం. ఇక, రెండో అర్ధభాగంలో ఇరు జట్లు గోల్ కోసం విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ.. గోల్ మాత్రం నమోదు కాలేదు. పెనాల్టీ రూపంలో అర్జెంటీనాకు వచ్చిన అవకాశాన్ని మెస్సీ గోల్గా మలచడంలో విఫలమయ్యాడు.
తొలి అర్ధభాగంలో అర్జెంటీనా తరఫున అగ్యురో 19వ నిమిషంలో గోల్ చేసి జట్టుని ఆధిక్యంలో నిలిపాడు. దీంతో అర్జెంటీనా శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. అయితే, ఆ తర్వాత కొద్ది సేపటికే ఐస్ల్యాండ్ కూడా గోల్ కొట్టింది. ఐస్ల్యాండ్ ఆటగాడు ఫిన్ బొగాసన్ 23వ నిమిషంలో మెరుపు గోల్ చేయడంతో ఇరు జట్లు 1-1తో సమం అయ్యాయి.
తొలిసారి ప్రపంచకప్లో ఆడే అవకాశం దక్కించుకున్న పసికూన ఐస్ల్యాండ్ జట్టు అర్జెంటీనా జట్టుకు గట్టి పోటీ ఇచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. ఈ మ్యాచ్లో అర్జెంటీనా జట్టు 7 సార్లు అనవసర తప్పిదాలకు పాల్పడగా... ఐస్ల్యాండ్ జట్టు 13 సార్లు అనవసర తప్పిదాలకు పాల్పడింది.