హైదరాబాద్: ఫిఫా వరల్డ్ కప్ పోటీల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. 2026 నుంచి జరిగే ఫిఫా వరల్డ్ కప్ టోర్నీల్లో జట్ల సంఖ్యను 48కి పెంచనున్నట్లు ఫిఫా పేర్కొంది. అంతేకాదు ఫిఫా వరల్డ్ కప్ పోటీలు ఇక నుంచి కొత్త ఫార్మాట్లలో జరగనున్నాయని తెలిపింది.
ఇందులో భాగంగా ఇప్పుడున్న 32 జట్లకు అదనంగా మరో 16 జట్లు పెంచుతున్నట్లు తెలిపింది. మొత్తం 48 దేశాలు ఈ టోర్నీలో పాల్గొననున్నట్లు ఫిఫా మంగళవారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.
2026 వరల్డ్ కప్ నుంచి ఈ కొత్త ఫార్మాట్ను అమలు చేయనున్నట్లు ఫిఫా స్పష్టం చేసింది. 1998 నుంచి ఫుట్ బాల్ వరల్డ్కప్ను 32 జట్లతో నిర్వహిస్తున్నారు. ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో చేసిన జట్ల విస్తరణ ప్రతిపాదనను ఫిఫా కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది.
2018లో జరగనున్న ఫిఫా వరల్డ్ కప్కు రష్యా ఆతిథ్యమిస్తుండగా, 2022లో జరగనున్న వరల్డ్ కప్కు ఖతార్ ఆతిథ్యమిస్తోంది. రష్యాలో 2018లో జరిగే ప్రపంచకప్నకు 550 కోట్ల డాలర్ల రాబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పుట్బాల్ వరల్డ్ కప్లో 64 మ్యాచ్లు జరుగుతున్నాయి.
కొత్త ఫార్మాట్తో 2026 నుంచి జట్ల సంఖ్య 80కి పెరుగుతుంది. దీంతో ప్రత్యక్ష ప్రసారాలు, ఒప్పందాల రూపంలో అదనంగా మరో 100 కోట్ల డాలర్ల ఆదాయం రానుంది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం డిగో మారడోనా జట్ల విస్తరణ వల్ల ఆటకు మరింత ఆదరణ పెరుగుతుందన్నారు.