హైదరాబాద్: తొలిసారి భారత్ ఆతిథ్యమిస్తున్న ఫిఫా అండర్ 17 వరల్డ్ కప్కు 238 రోజుల సమయం ఉంది. దీంతో ఈ టోర్నీకి సంబంధించి అధికారిక మస్కట్ శుక్రవారం విడుదలైంది. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో 'ఖేలియో'ను కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్, ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్లు విడుదల చేశారు.
ఫిఫా అండర్ 17 వరల్డ్ కప్ మస్కట్గా దక్షిణాసియాలోని హిమాలయ ప్రాంతంలో ఎక్కువగా కనిపించే చిరుతను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా క్రీడల మంత్రి గోయల్ మాట్లాడుతూ భారత్లో జరిగిన క్రీడా కార్యక్రమాల్లో ఇంతకుముందెన్నడూ చూడని విధంగా ఈ మస్కట్ గుర్తిండిపోతుందన్నారు.

ఖేలియో యంగ్, వైబ్రెంట్, ఉత్సాహభరితం దేశాన్ని ప్రతిబింబించేలా ఉందని చెప్పారు. ఫుట్బాల్ క్రీడ మరింత ఉత్సాహంగా జరిగేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఇక ప్రపుల్ పటేల్ మాట్లాడుతూ అధికారిక మస్కట్ టోర్నీ మొత్తాన్ని ప్రతిబంబించేలా ఉందన్నారు.

మస్కట్ను అధికారికంగా ప్రకటించడం వల్ల ఈ క్రీడను అభిమానులకు మరింత చేరువయ్యేలా చేస్తుందని అన్నారు. కాగా, 2017 సెప్టెంబరు-అక్టోబరు మధ్య ఫిఫా అండర్ 17 టోర్నీని నిర్వహించనున్నారు. భారత్లోని ఆరు స్టేడియాల్లో మ్యాచ్లు జరగనున్నాయి. ఈ టోర్నీలో భారత్తో సహా 24 జట్లు పాల్గొంటున్నాయి.