హైదరాబాద్: భారత్లో ఫుట్బాల్ పండగ వచ్చేసింది. అక్టోబర్ 6 నుంచి 28 వరకు ఫిఫా అండర్-17 వరల్డ్ కప్కు భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తోంది. యూరోపియన్, అమెరికా, ఆఫ్రికా దేశాలకే పరిమితమైన పుట్బాల్ క్రేజ్ను ఆసియా దేశాల్లోనూ వ్యాపింపచేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులను భారత్కు కట్టబెట్టింది.
అజర్బైజాన్, ఐర్లాండ్, ఉజ్బె కిస్థాన్ వంటి దేశాలతో పోటీపడి 2013లో ఆతిథ్య హక్కులు దక్కించుకున్న భారత్ ఈ మెగా టోర్నీ నిర్వహణ కోసం పూర్తిగా సంసిద్ధమైంది. ఏ స్థాయిలోనైనా ఫుట్బాల్ ప్రపంచకప్ను నిర్వహించడం కానీ, పాల్గొనడం కానీ భారత్కు ఇదే తొలిసారి. ఈ మెగా ఈవెంట్లో మొత్తం 24 జట్లు పోటీ పడుతున్నాయి.

ఈ మెగా టోర్నీ కోసం ఆరు వేదికలను సిద్ధం చేశారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, కొచ్చి, గౌహతి, గోవా వేదికల్లో పోటీలు నిర్వహించనున్నారు. 24 జట్లను ఆరు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఎలో ఉన్న ఆతిథ్య భారత్ అక్టోబర్ 6న జరిగే ఆరంభ పోరులో అమెరికాతో తలపడనుంది.
52 మ్యాచ్లు జరిగే ఈ టోర్నీ అక్టోబర్ 28న జరిగే ఫైనల్తో ముగుస్తుంది. అయితే ఐదుసార్లు విజేత, డిఫెండింగ్ చాంపియన్ నైజీరియా ఈ టోర్నీకి అర్హత సాధించలేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 2013, 2015లో టైటిళ్లు నెగ్గిన నైజీరియా ఈ వరల్డ్ కప్కు అర్హత సాధించకపోవడానికి ఓ కారణం ఉంది.
అర్హత పోటీల్లో ఆటగాళ్ల వయసు ధ్రువీకరణల్లో మోసానికి పాల్పడ డంతో ఆ జట్టు ఈ టోర్నీకి అర్హత సాధించలేకపోయింది. 26 మంది సభ్యుల జట్టులో 24 మంది తప్పుడు వయసు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్టు తేలింది. అండర్-17 ప్రపంచకప్కు అర్హత సాధించాల్సిన టోర్నీలోని తొలి అంచెలో తప్పుడు ధ్రువ పత్రాలతో ఎక్కువ వయసున్న ఆటగాళ్లను ఆడించడంతో ఈ పోటీల నుంచి నైజీరియాను తప్పించారు.
అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించిన నైజీరియాకు భారత్లో జరిగే ఈ టోర్నీలో ఆడటం లేదు. అయితే దీనిపొరుగు దేశమైన నైజెర్ తొలిసారిగా అండర్-17 వరల్డ్కప్నకు అర్హత సాధించింది. నైజీరియా గైర్హాజరీలో మూడుసార్లు చాంపియన్ బ్రెజిల్, జర్మనీ, ఘనా, చిలీ, ఫ్రాన్స్, స్పెయిన్ టైటిల్ రేసులో ముందున్నాయి.